పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Tuesday, January 17, 2012


జగద్గురు ' ఆది శంకరాచార్య' విరచిత '' నిర్వాణ షట్కం ''


(1 )


మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే 
నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం 


నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను,చిత్తమునూ కాను, నేను
కర్ణములనూ కాను, నేను జిహ్వనూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐననాసికనూ కాను,
నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ 
కాను నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుదనైన శివుడనే, 
శివుడనే. నేను అంతఃకరణ చతుష్టయము ఐన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను 
కాను. నేను జ్ఞానేద్రియములైన త్వక్, చక్షు, శ్రోత్ర, (జిహ్వ)రసన, ఘ్రాణ ఇంద్రియములు అంటే చర్మము, కనులు, చెవులు,నాలుక, నాసిక(ముక్కునూ) కాను.అంటే 'నాకోసం' అని ఎవరి కోసం అయితే చర్మము ద్వారా, కనుల ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నానో ఆ అనుభవించేది నేను కాను. ఆ అనుభవము నాదీ కాదు. అంటే అనుభవించే వాడు వేరే, నేను కాదు. అంటే నాకోసం అని తుచ్చమైన ఆనందాలకు నేను లోను కానవసరం లేదు, కాకూడదు, అంటే నేనే కాదు ఎవరూ కూడా లోను కావలసిన అవసరం లేదు. ఎందుకంటే వీటి ద్వారా కలిగే ఆనందాలు క్షణికాలు కనుక! నేను పంచ మహా భూతములు ఐన పృదివ్యాపస్తేజో వాయురాకాశములను కాను.అంటే నేను భూమిని కాను, జలమును అంటే నీరునూ కాను, తేజస్సు అంటే అగ్నినీ కాను, నేను వాయువునూ కాను, ఆకాశమునూ కాను. పంచ భూతాత్మకమైన ఈ శరీరమును నేను కాను.ఎందుకంటే పంచ భూతాత్మికమైన ఈ శరీరం పంచ భూతములలో కలిసిపోతుంది కనుక. ఇక్కడి ఇంకొక రహస్యం ఏమిటంటే పంచ తన్మాత్రలైన శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములనుండి వరుసగా పంచ మహా భూతములు ఐన ఆ కాశము ,అగ్ని ,వాయువు, జలము, భూమి ఉద్భవించాయి, వీనిని గ్రహించడానికి, అనుభవించడానికి వరుసగా 
పంచ జ్ఞానేంద్రియములు ఐన చెవులు, కనులు, చర్మము, జిహ్వ, నాసిక ఉద్భవించాయి. 
వీటి ద్వారా ఈ జ్ఞానములు అనుభవం లోకి వస్తాయి కనుక వీటిని జ్ఞానేంద్రియములు అన్నారు. 

2)


నచ ప్రాణ సంజ్ఞో నవై పంచ వాయుర్నవా సప్త ధాతుర్నవా పంచ కోశః
న వాక్ పాణి పాదౌ నచోపస్థ పాయు చిదానంద రూపశ్శివోహం శివోహం


నేను ప్రాణ వాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు సంఘమును కాను, 
సప్త ధాతువులైన రక్త, మాంస, మేథ, అస్థి, మజ్జ, శుక్ర, రసములను కాను, నేను అన్నమయ, 
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే పంచ కోశములను కాను, నేను 
పంచ కర్మేంద్రియములైన వాక్కు, చేతులు, పాదములు, కామ ఇచ్చను తీర్చుకునే ఇంద్రియమును
కాను, విసర్జక అవయవ ఇంద్రియమునూ కాను..చిదానంద రూపుదనైన శివుడనే, నేను శివుడనే! 


(3)

న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ 
న ధర్మో నచార్దో న కామో న మోక్షః చిదానంద రూపశ్శివోహం శివోహం 


నాకు ద్వేషము లేదు, రాగము లేదు, నాకు లోభము లేదు,మోహము లేదు, నాకు మదము 
కానీ, మాత్సర్యము కానీ లేవు, నాకు ధర్మము, అర్ధము, కామము, మోక్షము లేవు, నేను 
చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! అనగా నాకు ఏ ద్వంద్వములూ లేవు, నాకు 
యే పురుషార్ధములూ లేవు..ఎందుకనగా..నేను భౌతిక శరీరాన్ని కలిగిన మానవుడిని కాను 
కనుక నేను సాక్షాత్తూ శివుడను కనుక, మానవ సహజమైన మంచి చెడులకు అతీతుడను కనుక!

4)

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ 
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శ్శివోహం శివోహం 

నాకు పుణ్యము లేదు, పాపమూ లేదు, సౌఖ్యము లేదు, దు:ఖము లేదు,మంత్రము, తీర్ధము,వేదము, యజ్ఞము, ఏవీ లేవు. నేను అనుభవమును కాను, అనుభవించుట యను 
క్రియనూ కాను, అనుభవించే వాడినీ కాను, నేను చిదానంద రూపుడనైన శివుడను, 
నేను శివుడను!


(5)

న మృత్యుర్నశంకా నమే జాతి భేద: పితా నైవ మే నైవ మాతా చ జన్మ 
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపశ్శివోహం శివోహం 

నాకు మృత్యువు లేదు, శంకా లేదు, జాతి భేదములు లేవు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జన్మ 
లేదు, నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యులు లేరు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! జనన మరణములు, జాతి భేదములు, తల్లి దండ్రులు, 
గురు శిష్యులు..ఏ బంధములు లేవు..ఎందుకనగా..నేను శివుడను కనుక..అన్ని బంధములకు, అనుబంధములకు అతీతుడను కనుక!

6)

అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న చా సంగతం నైవ ముక్తిర్నబంధః చిదానంద రూపశ్శివోహం శివోహం 

నేను నిర్వికల్పుడను అనగా నాకు వేరే సాటి ఐనది లేదు, నేను నిరాకారుడను, ఎందుకంటే ఈ 
ఆకారం శాశ్వతం కాదు కనుక, అన్నింటికీ, అంతటా అన్ని ఇంద్రియములకూనేనే అధిపతిని, 
నాకు ధించినవి సంబంధించనివి ఏవీ లేవు, నాకు ముక్తి లేదు, బంధమూ లేదు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! ఇది నిర్వాణ శతకమునకు సాహిత్యానువాదము, కొద్ది వ్యాఖ్యానముతో. ఆది శంకరాచార్యులవారి సాహిత్యం స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించ వచ్చు క్లుప్తముగా. ఇది వైరాగ్య ప్రకరణముల కోవలోనిది. ఆధునిక పోటీ పరీక్షలలో జవాబులు తప్పుగా ఇచ్చినప్పుడు, సరిగా జవాబులిచ్చిన కారణంగా వచ్చే 'మార్కుల'నుండి తప్పుగా ఇచ్చిన వాటికి శిక్షగా మార్కులు తగ్గించే పద్ధతి వుంటుంది కొన్ని పరిక్షలలో. అందుకని సమాధానం సరిగా తెలియనప్పుడు సరి కాని సమాధానములను వరుసగా ఇది కాదు, ఇది కాదు అని చివరికి సరి ఐన లేదా సరి ఐనట్లు అనిపించిన సమాధానమును చేరుకొనే పద్ధతి కటి ఉంది. దీనినే తీసివేత పద్ధతి లేదా ఆంగ్లంలో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం, అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక 'ఇది కాదు' 'ఇది కాదు' అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం 'నేతి'..'నేతి'..అంటే .'న ఇతి'..'న ఇతి'..అంటే..'ఇది కాదు'..'ఇది కాదు'..అనే 'నేతి' మార్గం అని చెప్పింది! ఈ నిర్వాణ శతకం లో 'చిదానంద రూపుడైన శివుడు' అనే పరమాత్మ తత్త్వాన్ని అదే మార్గంలో ఆది శంకరుడు తెలియ జేశారు! నిర్వాణ షట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము కాని, ఇక్కడ క్లుప్తముగా మాత్రమే చర్చ ప్రస్తుతానికి!ఒకరి అభ్యర్ధన మేరకు, వారి సందేహములను ప్రస్తుతానికి తీర్చడానికి నాకున్న కొద్ది పరిధిలో, అల్ప జ్ఞానముతో చేస్తున్న ప్రయత్నము ఇది.


మనో బుద్ధ్యాహంకార చిత్తాని నాహం.. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు విధములైన అంతః కరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని 
ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది, అందలాలెక్కిస్తుంది, అధః పాతాళానికి తొక్కేస్తుంది. కనుకనే మనసే అన్నింటికీ కారణం, ప్రేరణం, ఉత్ప్రేరకం, వినాశకరం. అందుకే ' మన ఏవ మనుష్యాణామ్ కారణం బంధ మోక్షయో:' మనుషుల బంధాలకు, మోక్షానికి కారణం మనసే అన్నది ఒక 
ఉపనిషత్తు! 'ద్వే శబ్దే బంధ మోక్షాయ మమేతి న మమేతిచ, మమేతి బధ్యతే జంతు: న మమేతి విముచ్యతే.. 'నాది', 'నాది కాదు' అనే రెండు శబ్దాలే బంధానికీ, మోక్షానికీ కారణాలు, నాది అనుకుంటే బంధం, ఎందుకంటే నాది అనే దానితో మొదలై, నాది మాత్రమే, నాకు మాత్రమే, నాకు కాకున్నా పరవా లేదు ఎవరికీ కాకూడదు..నాది కాకున్నా పరవా లేదు, ఎవరిదీ కాకూడదు, ఎవరికీ చెందకూడదు..అనే దాకా దారి తీస్తుంది. ఆది వినాశనానికి దారి తీస్తుంది. ఈనాడు సమాజంలో జరుగుతున్న హింసకు, దౌర్జన్యానికీ అదే కారణం! 


బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. మంచి, చెడులను గ్రహింప గలుగుతుంది. చిత్తము తన ఇష్టం 
చ్చినట్లుగా ప్రవర్తించేలా చేస్తుంది. అహంకారం మహదహంకారం(గొప్ప అంధకారం) మిధ్యాహంకారం (మిధ్యాన్ధకారం) అని రెండు రకాలుగా ఉన్నది. అహంకారం అంటేనే అంధ కారం. సృష్టికి మొదలు మహా అంధకారం వ్యాపించి వున్నది..ఏదీ తెలియని బ్రహ్మ దేవుడు తనకన్నా పరమాత్ముడు ఐన వాడిని ప్రార్ధిస్తే ఆ శ్రీ మహా విష్ణువు తన తేజః పుంజములతో దానిని తొలగించి కరుణిస్తే, అప్పుడు బ్రహ్మ తన సృష్టిని కొనసాగించాడు అని పురాణ గాధ. 


నేను అనేది సాత్త్వికాహంకారం, నేను కూడా అనేది రాజసిక అహంకారం, నేను మాత్రమే అనేది తామసిక అహంకారం! నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడి నుండి, ఎక్కడికి అనే అన్వేషణ 
సాత్త్వికమైనది, మనిషిని వున్నతుడిని చేస్తుంది. నేను కూడా అనేది రాజసికమైనది, నాకూ ఒక ఉనికి, ఒక సత్తా ఉంది అనే సాధనకు ఉపకరిస్తుంది..ఈ రెండూ మంచివే..అవసరమైనవే. నేను మాత్రమే, నాకు మాత్రమే, నాది మాత్రమే అనేది తమసికమైనది, ఆది కలిగివున్నవాడిని, వాడి ద్వారా సర్వాన్నీ నాశనం చేస్తుంది. ఈ నాశనానికి చిత్తం బాటు వేస్తుంది, చిత్తం వచ్చినట్లు ప్రవర్తించడం ద్వారా, దానికి మనసు కారణమౌతుంది సరిగా వుపయోగించకుంటే, మనసే అన్నింటికీ కారణం కనుక దానిని బుద్ధికి స్వాధీనం చేసి, అప్పుడు బుద్ధి ద్వారా కలిగిన విచక్షణతో మంచి చెడులను తెలిసికొని, మంచిని గ్రహించి, చెడును విసర్జించాలి కనుక బుద్ధి పరమాత్మ తత్త్వం. ఉపనిషత్తులు అన్నీ ఇదే చెప్పాయి.


ఆత్మానగుం రధినం విద్ధి శరీరం రధమేవతు బుద్ధించ సారధిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ, 
ఇన్ద్రియాణి హయాన్యాహు: తేషాం విషయ గోచరాన్, అత్మెంద్రియ మనో యుక్తం భోక్తేత్యాహు
ర్మనీషిణః .. అన్నది ఒక ఉపనిషత్తు. అంటే శరీరమే రధము. ఆత్మ అంటే పరమాత్మ స్వరూపి 
ఐన జీవాత్మ రధికుడు. అంటే రధాన్ని ఎక్కే వాడు. బుద్ధి సారధి. అంటే పరమాత్మ రూపకమైన 
బుద్ధి ఈ రధాన్ని నడిపితే, గుర్రములవంటి ఇంద్రియములను మనసు అనే కళ్ళెం తో అదుపు 
చేస్తూ, పరమాత్ముడి సారధ్యంలో, సర్వం ఆయనకే అప్పగించి, నమ్మి,కూర్చుంటే రధాన్ని 
క్షేమంగా గమ్యానికి నడుపుతాడు, కనుక మనసు అనే కళ్ళెమును కూడా సారధి ఐన 
పరమాత్ముడికి అప్పగించాలి అంటే మనసును పరమాత్ముని యందు లగ్నం చేయాలి. ఆత్మ, 
ఇంద్రియాలు, మనసు కలిగిన వాడిని భోక్త అంటారు, డానికి బుద్ధిని కూడా జోడిస్తే ఆ భోక్తృత్వ 
భావన నశిస్తుంది. అప్పుడు నేను చేస్తున్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అనే భావన 
నశిస్తుంది. అప్పుడు సుఖ దు:ఖాలూ, రాగ ద్వేషాలు, బంధ మోక్షాలూ, మంచీ చెడూ, ఇలాంటి 
ద్వంద్వాలు నశిస్తాయి. శివమే అంటే శాంతమే, సౌఖ్యమే, ఆనందమే మిగులుతుంది..కనుక 
శివోహం..శివోహం!

బుద్ధికి అప్పజెప్పి ప్రయాణం చేస్తే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రి యాలూ దారి తప్పవు, మంచి కర్మలే 

మిగులుతాయి, మంచి జ్ఞానమే మిగులుతుంది అప్పుడు శివుడౌ తాడు మానవుడు, కనుక ఇంతా
కలిగిన శివుడనే నేను!

సప్త ధాతువులు, పంచ ప్రాణాలు, పంచ కోశాలు, బంధాలు, భవ బంధాలు, అనుబంధాలు,
సంబంధాలు 
అన్నీ నేను దేహం అనుకుంటే అవి గెలుస్తాయి, నేను దేహమును కాను ఎందుకంటే దేహం శాశ్వతం కాదు 
కనుక, అని తెలిసికొంటే దేహం నశిస్తుంది, ఆత్మ రహిస్తుంది ఆత్మ మిగులుతుంది, ఆ ఆత్మ పరమాత్మ తత్త్వం కనుక, జీవం ఉన్నంత కాలం జివునితో  వుండి తరువాత దేవునితో కలిసిపోతుంది కనుక, దానికి మరణం 
లేదు, కనుక ఆది శాశ్వతం.ఈ జ్ఞానం కలిగితే దేహం ద్వారా వచ్చే ఏ మంచి చెడు..సుఖ దు;ఖాలు..మొదలైన ద్వంద్వాలున్డవు కనుక అప్పుడు మిగిలేది పరమానందమే కనుక నేను శివుడను, నేను శివుడనే! మనసును బుద్ధి ద్వారా నియమించుకుని కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించి, కర్మేన్ద్రియములను, జ్ఞానేన్ద్రియములను, ప్రాణ వాయువులను, సప్త ధాతువులను,పంచ మహా భూతాలను, పంచ కోశాలను జయించి అంటే ఇవన్నీ జయించడం ద్వారా మిగిలిన పరమానందమును అనుభవించడం ద్వారా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడనే నేను!


యద్వాచా నాభ్యు దితం యేన వాగభ్యుధ్యతే ....
యన్మనసా న మనుతే ఏనాహుర్మనోమతం ....
యత్ చక్షుసా న పశ్యతి యేన చక్షూగుమ్సి పశ్యతి....
యత్ శ్రోత్రే ణ న శ్రుణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం... 
యత్ ప్రాణేన న ప్రాణితి యేన ప్రాణాః ప్రణీయతే... 
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే ....

ఏది వాక్కుల ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా వాక్కు పలుకడం జరుగుతుందో, ఏది 
మనసు ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా మనసు దేనినైనా తెలిసికొన గలుగుతుందో, 
ఏది కనుల ద్వారా చూడ బడ జాలదో, దేని ద్వారా కనులు చూడ గలుగుతాయో, ఏది చెవుల 
ద్వారా వినబడ జాలదో దేని ద్వారా చెవులు విన గలుగుతాయో, ఏది ప్రాణములచేత జీవింపదో, 
దేని ద్వారా ప్రాణములు జీవింప గలుగుతాయో అదియే బ్రహ్మము..వేరేది ఏదీ కాదు..అని 
చెప్పింది ఉపనిషత్తు. రెండు పెదవులు, ముప్పై రెండు పళ్ళూ, నాలుక, కొండ నాలుక వున్న
వాళ్ళు కూడా పలుక లేని వారు వున్నారు, మూగ వాళ్ళు, అంటే వీటన్నింటికీ పలుకును ఇచ్చే 
శక్తి ఒకటి వున్నది కదా, ఆది లేక పోతే ఇవన్నీ వున్న వాళ్ళు కూడా పలుకలేరు కదా, కళ్ళు, 
కను బొమలు, కను గుడ్లు అన్నీ సరిగా వున్నా చూపు లేని వాళ్ళు గుడ్డి వాళ్ళు వున్నారు, 
అంటే వీటన్నింటికీ చూపును ఇచ్చే శక్తి ఒకటి వేరేది వున్నది, అలాగే చెవులున్నా, కర్ణభేరి వున్నా 
మిగిలినవి అన్నీ సరిగా వున్నా వినలేని చెవిటి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నిటికీ విన గలిగిన 
శక్తిని ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ప్రాణములు వున్నప్పుడూ తెలియబడనిది, అదేదో తెలియనిది ఐన ఏది లేకుంటే ప్రాణములు లేకుండా పోతాయో దాని వల్లనే ప్రాణములున్నట్లు, జీవం వున్నట్లు కనిపిస్తుందో...అదియే బ్రహ్మము..అంటే కేవలం పైకి కనిపించే నోరు, కళ్ళు, చెవులు,ఇవన్నీ సరిగా వున్నా  అవి పని చేయకుండ పోతాయి, అంటే వీటికి శక్తినిచ్చే శక్తి ఒకటి ఉంది కదా..అదే బ్రహ్మం. పంచకర్మేంద్రియాలూ. పంచ జ్ఞానేంద్రియాలు అలాగే వున్నా ప్రాణం లేని శరీరం ఎందుకూ పనికి రాదు, ఏదీ చేయ లేదు. నోరున్నా పలుక లేదు,చేతులున్నా పను చేయ లేవు, కాళ్ళు వున్నా నడువ లేవు, కామేంద్రియం వున్నా పని చేయదు, కామం వుండదు, విసర్జక అవయవం వున్నా విసర్జించే శక్తి వుండదు , చర్మం వున్నా స్పర్శను గ్రహింప లేదు, కనులు వున్నా చూడలేవు,చెవులు వున్నా వినలేవు, నాలుక వున్నా రుచి చూడ లేదు, ముక్కు వున్నా వాసన చూడలేదు, సప్త ధాతువులూ వున్నా వాటి పని అవి చేయ లేవు, పంచ కోశాలు వున్నా పనికి రావు..ఇవన్నీ వున్నా ఏది లేకుంటే ఇవన్నీ లేనట్లే లెక్కనో అదే ప్రాణ శక్తి, అదే బ్రహ్మం, అదే జీవం, అదే నాదం, అదే వేదం! కనుక ఆ శక్తిని మాత్రమే శాశ్వతము ఐన శక్తిగా తెలిసికొంటే మిగిలినవన్నీ అశాశ్వతాలు అని తెలిసికొనడం జరుగుతుంది. అప్పుడు మిగిలిన వాటి ద్వారా వచ్చే సుఖ దు:ఖాలు, జయాపజయాలు, క్షణికమైనవి అని తెలుస్తుంది, ఆనందమే మిగులుతుంది, కనుక శివుడనై  పోతాను కనుక నేను శివుడను, నేను శివుడనే!

అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం
తథా అరసం నిత్య మగంధ వచ్చయత్
అనాద్యనంతం మహతః పరం ధృవం
నిచాయ్య తన్మ్రుత్యు ముఖాత్ప్ర ముచ్యతే..అన్నది ఉపనిషత్తు ఇదే భావాన్ని తెలియ జేస్తూ..ఈ జ్ఞానం కలిగినప్పుడు మృత్యువు లేకుండా పోతుంది, పుట్టుకే శాశ్వతం కాదు అని తెలిస్తే మృత్యువూ శాశ్వతం కాదు 
అని తెలుస్తుంది కనుక మృత్యువు వుండదు, ఇదంతా అశాశ్వతం అని తెలుస్తుంది కనుక ఇవన్నీ పోయేవే అని తెలుస్తుంది కనుక భయం వుండదు, ఆ భయమే మృత్యువు, ఆ బలహీనతే మృత్యువు, తెలిసికొన్న ఆ శాశ్వత సత్యం, ఆ శక్తి అదే జీవం, ఎందుకంటే దానికి చావు అంతం అనేది లేదు కనుక, ఇదే భావాన్ని స్వామి వివేకానంద చెప్పింది! ఇక్కడ చావు వుండదు అంటే పుట్టుకా శాశ్వతం కాదు, చావూ శాశ్వతం కాదు, అవి సహజ ధర్మాలు,అనివార్యాలు అని తెలియడం వలన కలిగే జ్ఞానం వలన కలిగే ఆనందం వలన మృత్యు భీతి వుండదు కనుక మృత్యు భావం వుండదు కనుక మృత్యువు వుండదు అని అర్థం, అంతే కానీ ఈ జ్ఞానం కలిగిన వాడు శారీరకంగా చిరంజీవి అని కాదు, శరీరానికే మృత్యువు, ఆత్మకు కాదు అని తెలిసికొనడం వలన కలిగే చావు లేని ఆత్మ జ్ఞానం అని అర్థం!..ఎందుకంటే ఆ ఆత్మకు చావు లేదు కనుక..ఇదే శ్రీ కృష్ణుడు అర్జునునితో చెప్పింది!


నిర్వాణ షట్కానికి ఇంకా పంచ కోశ వివరణ మాత్రమే వున్నది..ఇక్కడ మిగిలిపోయింది..అది ఇంకా మరీ లోతైనది, ఇక్కడ అంత అవసరం ఈ సాహిత్యాన్ని అర్థం చేసికొనడం కోసం లేదని ప్రస్తుతానికి 
ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. నా అల్ప బుద్ధికి అందిన విషయాన్ని ఇక్కడ ఇవ్వడానికి ఆ జగద్గురువుల ప్రేరణకు ఆయన 
పాద పద్మములకు వినయంగా అంజలిస్తూ...స్వస్తి!


--
Vara Prasad!

Wednesday, January 4, 2012

మనీషా పంచకం


జగద్గురువు ఆది శంకరాచార్యులవారు కాశీ పట్టణం లో బస చేసిన రోజులలో ఒకనాడు గంగా నదిలో స్నానం చేసి శిష్యులు ముందునడుస్తుండగా రేవునుండి వస్తున్నప్పుడు ఒక చండాలుడు నాలుగు వేట కుక్కలతో వీరికి ఎదురుగా వచ్చాడు. శంకరాచార్యులవారి శిష్యులు ఆ చండాలుడిని ప్రక్కకు తప్పుకొని దారి ఇమ్మని అన్నారు,వెనుకగా వస్తున్న తమ గురువు గారికి అతను అడ్డుగా వస్తాడేమోనని.అప్పుడా ఛండాలుడు ఒక ప్రశ్న వేశాడు. ఎవరినయ్యా తప్పుకోమంటున్నారు?అని..(అంటే నన్నా.నన్నే అయితే శరీరంచేత ఎవడూ నీచుడూ కాదు..ఉన్నతుడూ కాడు కదా..పైకి కనిపించే నేను నిత్యం కాడు..లోపలి నేనే నిత్య్డు, శాశ్వతుడు కదా. మీలోనూ నాలోనూ వున్న ఆ 'నేను' అనేదానికి ఏ మాలిన్యమూ లేదుకదా మరి ఎందుకు ప్రక్కకు తప్పుకొమ్మంటున్నారు? .లోపలి 'నేనే'ఈ విశ్వమంతటా నిండి వున్నాడు కదా..అనే లోతైన భావంతో వేసిన ప్రశ్నగా ఆ ప్రశ్నను భావించిన)ఆది శంకరాచార్యులవారు అంత 
లోతైన ప్రశ్నను వేసిన ఆ చండాలుడిని సాక్షాత్తూ శివునితో సమానుడిగా..ఆ నాలుగు కుక్కలను 
నాలుగు వేదములుగా భావించి, సాష్టాంగ నమస్కారం చేసి,ఐదు శ్లోకాలలో వెలువరించిన స్తోత్రమే 
మనీషా పంచకం. ఐదు శ్లోకాలు వున్నాయి కనుక పంచకం. ప్రతి శ్లోకమూ 'మనీషా మమ'
(అంటే నాదృష్టిలో మహానుభావుడు అని అర్థం) అనే మకుటం తో అంతం ఔతుంది కనుక 
మనీషా పంచకం అని పేరు వచ్చింది ఈ స్తోత్రానికి.

భారతీయ వేదాంత తత్త్వాన్ని సంక్షిప్తంగా చెప్తే ఆది మనీషా పంచకమౌతుంది.భారతీయ ఆధ్యాత్మిక సర్వస్వాన్నిసంక్షిప్తంగా చెప్తే ఆది మనీషా పంచకమౌతుంది. సమస్త వేదాల,ఇతిహాసాల,పురాణాల 
సారం మొత్తం సంక్షిప్తంగా ఒకచోట చేరిస్తే ఆది మనీషా పంచకమౌతుంది.

మరొక అద్భుతమైన రహస్యం ఏమిటంటే ఉపనిషత్తులలో 'శుక రహస్యోపనిషత్' అనే గొప్ప ఉపనిషత్ 
ఒకటి ఉన్నది. వేదనిలయుడైన దక్షిణామూర్తి అవతారమైన ఆది శంకరుడు శుకరహస్యోపనిషత్ కు
సాక్షాత్తూ అనువాద రూపకంగా మనీషా పంచకాన్ని చెప్పారు, ఆశువుగా! మనీషా పంచక స్తోత్రమును తెలుసుకొనడానికి ముందు కొంత వేదాంత చర్చ పరిశీలన అవసరం.వేదాంత ప్రపంచంలోఅంటే 
ఉపనిషత్తులలో గొప్ప సూక్తులవంటివి చిన్న చిన్న వాక్యాల రూపంలోవున్నాయి,వీటినే మహా
వాక్యాలు అంటారు. అంటే పరమోన్నత సత్యాలను సూక్ష్మ రూపంలోచిన్న చిన్న వాక్యాల రూపంలో చెప్పినవన్నమాట..గణితం లో సూత్రాలవలె.ఈ వాక్యాలను వివరంగా,విపులంగా విశదీకరించి విమర్శ 
చేస్తే లోతైన సత్యాలు సాక్షాత్కరిస్తాయి. మహా వాక్యాలు అనేకం వున్నాయి,వాటిలో 108ముఖ్యమైనవి 
అని చెప్తారు. వాటిలో కూడా 27 ఇంకా ముఖ్యమైనవి.వాటినే మహావాక్య నక్షత్ర మాలిక అంటారు.27 నక్షత్రములవంటివి ఈ 27 మహావాక్యాలు అనే ఉద్దేశంతో. వీటిలో కూడా 4 మహావాక్యాలు
మహోన్నతమైనవి.వాటినే మహావాక్య చతుష్టయం అంటారు. అవి (1)ప్రజ్ఞానం బ్రహ్మ (ఋగ్వేదంలోని 
ఐతరేయ ఉపనిషత్ లోనిది).(2) అహం బ్రహ్మాస్మి (శుక్ల యజుర్వేదంలోని బృహదారణ్యక ఉపనిషత్ 
లోనిది). (3)తత్త్వమసి (సామవేదం లోని ఛాందోగ్య ఉపనిషత్ లోనిది) (4) అయమాత్మా బ్రహ్మ 
(అధర్వణవేదం లోని మాండూక్య ఉపనిషత్ లోనిది).వేద వ్యాసులవారి కుమారుడు, మహా జ్ఞాని, 
పుట్టుకతోనే విరాగి, యోగీ,ముక్తుడు ఐన శుక మహర్షికి ఉపనయనానికి యుక్తమైన వయసు
వచ్చినది అని భావించిన వ్యాసులవారు తన కుమారుడిని, శుకమహర్షిని తీసుకొని కైలాసానికి 
పరమ శివుని సన్నిధికి వెళ్ళాడు. శివునకు నమస్కరించి తన కుమారుడైన శుకమహర్షికి ఉపనయనం 
చేసి,బ్రహ్మోపదేశాన్ని, అంటే, గాయత్రీ మంత్ర ఉపదేశాన్ని చేయమని, అందుకు తగినవాడు 
పరమశివుడేనని భావించి అక్కడికి వచ్చినట్లుగా వ్యాసులవారు తెలియజేశారు. పరమశివుడు 
చిరునవ్వు నవ్వి '' నేనొక యోగిని..విరాగిని..నా చేత బ్రహ్మోపదేశం తీసుకుంటే నీ కుమారుడు కూడా 
సర్వ సంగ పరిత్యాగి అయి విరక్తుడై నిన్నూ వదిలి వెళ్ళిపోతాడేమో,తర్వాత నన్ను నిందించవద్దు సుమా'' 
అన్నాడు. వ్యాసులవారు ఏదేమైనా సరే, నా కుమారుడికి బ్రహ్మోపదేశాన్ని చేయడానికి మీరే సమర్ధులు 
స్వామీ..మీ చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని జరిపించండి అని పట్టుబడితే, సరే నని పరమ శివుడు కైలాసంలో, తన చేతులమీదుగా శుక మహర్షికి ఉపనయనం చేసి, తాను గురువై శుక మహర్షికి 
బ్రహ్మోపదేశం చేశాడు. అనంతరం శుక మహర్షి పరమ శివునకు సాష్టాంగ దండ ప్రణామం చేసి,తనకు 
మహావాక్య చతుష్టయాన్ని ఉపాసనా రూపకంగా ఉపదేశించమని కోరాడు. పరమ శివుడు శుకమహర్షికి 
పైన చెప్పుకున్ననాలుగు మహావాక్యాలను సాంగోపాంగములుగా,బీజాక్షరములతో,ధ్యానమంత్ర శ్లోకాలతో, అంగన్యాస కరన్యాసాలతో ఉపాసనా మార్గానికి అనువుగా ఉపదేశించాడు.ఆ ఉపదేశాన్ని స్వీకరించిన శుక 
మహర్షి ఆ వేదాంత జ్ఞాన సార మాధుర్యాన్ని మనసారా అనుభవించి,బ్రహ్మానంద సాగరంలో ఈదులాడుతున్నవానివలె అక్కడినుండి వెళ్ళిపోయాడు అని శుకరహస్యోపనిషత్ చెప్తుంది. మనీషా 
పంచకంలోని మొదటి నాలుగు శ్లోకాలను నాలుగు మహా వాక్యాలకు అనువాదరూపకంగా,ఐదవ శ్లోకాన్ని ఫలశ్రుతిగా ఆదిశంకరాచార్యులవారు మనకు అనుగ్రహించారు. శుకరహస్యోపనిషత్తునూ మనీషా పంచక 
స్తోత్రాన్నీపరిశీలిస్తే మనీషా పంచక స్తోత్రం శుక రహస్యోపనిషత్ కు తాత్పర్య రూపకంగా కనిపిస్తుంది! 
అద్భుతమైన ఈ రహస్యాన్ని అర్థం చేసుకొనడానికి చేసిన చిన్ని ప్రయత్నమే ఈ వ్యాసం.

(1)జాగృత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదు జ్జ్రుమ్భతే
యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ
సైవాహం నచ దృశ్య వస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తిచేత్ 
చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ 

తొణికిసలాడే 'కళ ' మెలకువలో,
కలలో, కదలని గాఢ నిద్రలో,
ఇమ్మనుజులలో, బ్రహ్మదేవునిలొ,
పిపీలకాదుల శరీరాలలో,
చరాచరమ్ముల శరీరాలలో,
నిన్నా,నేడూ,రేపూ నిలిచే 
అంతరంగమున, బహిరంగములో,
సాక్షిగ అక్షరమై వెలుగొందే
వెలుతురు నే నీ మేను కాననే
జ్ఞప్తిని కలిగిన వాడెవడైనా
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు!
మరి యాతడె పో, నా గురుదేవుడు!

(మెలకువతో ఉన్నప్పుడు, కలగంటున్నప్పుడు,గాఢ నిద్రలో వున్నప్పుడు..ఈ మూడు దశలలోనూ ఏ సంవిత్కళ,అంటే ఏ దివ్యమైన కళ, ఏ చైతన్యము, ఏ వెలుగు కొనసాగుతున్నదో, ఏది బ్రహ్మనుండి 
చీమవరకు సకల ప్రాణుల శరీరములలోనూ ఓత ప్రోతమై (అంటే దూదిలో దారం వలె) ఉన్నదో,అదే నేను, 
ఆ కళనే నేను,అంతే కాని కాంతికి కనిపించే ఈ శరీరం నేను కాను అనే దృఢమైన దివ్య జ్ఞానము ఎవరిలో ఉన్నదో..అతను జన్మచేత చండాలుడైనా, బ్రాహ్మణుడైనా అతనే నా గురుదేవుడు.అంటే,సమస్త కాలాలలో, 
సమస్త ప్రాణులలోవెలుగొందుతున్న దివ్యచైతన్యం ఒకటే, ఆ చైతన్యమే నాలోనూవెలుగొందుతున్నది, 
కనుక నేనుఎవరికీ భిన్నుడను కాను, అందరిలోఒకడిని, ఒకడిలో అందరిని, ఎవరికన్నా తక్కువా కాదు, 
ఎక్కువా కాదు,పైకి కనిపించే ఈ శరీరము నేను కాను, ఎందుకంటే ఈ శరీరం ఒకనాటికి లేకుండా 
పోయేదే, దానికి సంబంధించిన మెరుగులు, తళుకులు,గొప్పలు ఏవీ శాశ్వతం కావు, అవి కూడా 
నశించి పోయేవే, కానీ, శరీరంలోపలి దివ్య చైతన్యము సర్వ వ్యాప్తమైనది,అనంతమైనది,శాశ్వతమైనది,
అదే నేను, నా శరీరానికి లేకుండా పోవడం వున్నది కానీ, లోపలి దివ్య చైతన్యము నశించిపోనిది,అనే 
జ్ఞానం ఉన్న వారెవరైనా..వారే నా గురుదేవులు!

మనీషా పంచకంలోని ఈ ప్రథమ శ్లోకం ఋగ్వేదంలోని ఐతరేయ ఉపనిషత్తు లోని '' ప్రజ్ఞానం బ్రహ్మ '' అనే
వేదాంత మహావాక్యానికి ఎంత దగ్గిరగావుందో చూద్దాం.శుకరహస్యోపనిషత్ లో పరమశివుడు శుకమహర్షికి 
వేదాంత వాక్యాన్ని ఉపదేశించినప్పుడు రెండు శ్లోకాలను చెప్పాడు. ప్రజ్ఞానం అంటే ఏమిటి అనేది వివరిస్తూ..''ఏనేక్షతే శ్రుణోతీదం జిఘ్రతి వ్యాకరోతిచ స్వాద్వస్వాదు విజానాతి తత్ప్ర జ్ఞాన ముదీరితం''అన్నాడు 
పరమశివుడు!అంటే, దేనిద్వారా(బ్రహ్మమును, శాశ్వతమైన సత్యమును)చూడడం,వినడం,వాసనచూడడం 
అంటే గ్రహించడం,వ్యాప్తి చేయడం అంటే విపులీకరించడం అంటే విశదంగా తెలిసికొనడం జరుగుతుందో అదే 
ప్రజ్ఞానం అంటే విశిష్టమైన జ్ఞానం.ప్రజ్ఞానం బ్రహ్మ ను వివరిస్తూ, ''చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వ 
గవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి''...అన్నాడు పరమశివుడు!

అంటే చతుర్ముఖుడైన బ్రహ్మ మొదలైన దేవతలలోనూ,మనుషులలోనూ,అశ్వములలోనూ,గోవులలోనూ వున్నబ్రహ్మ చైతన్యం ఒక్కటే అనేదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇదే భావాన్ని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు '' విద్యా 
వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని,శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః'' అని వెల్లడించాడు,అంటే విద్య,వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిలోనూ,గోవులోనూ, ఏనుగులోనూ,కుక్కలోనూ,కుక్క మాంసం 
తినే చండాలుడిలోనూ పండితుడు సమదృష్టి కలిగి ఉంటాడు. అసలు పండితుడు అంటే ఎవరు అనేది కూడా ఆయనే చెప్పాడు, అదే గీతలో..వేరొక చోట!''యస్య సర్వే సమారమ్భాః కామ సంకల్ప వర్జితాః, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు: పండితం బుధాః ''అని, అంటే ఎవరి కర్మలు కామములతో అంటే ఏవో కోరికలను తీర్చుకొనడానికి చేసినవి కావో,జ్ఞానమనే అగ్నిలోదహింపబడినవో, వానిని పండితుడు అని విద్వాంసులు పలికెదరు అని! దీనినే అన్నమాచార్యుడు '' నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే,అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే, చండాలుడుండేటి సరిభూమి యొకటే''కడగి ఏనుగుపైన కాయు ఎందయునోకటే, పుడమి శునకముపైన బొలయు ఎండొకటే ''.''కందువగు హీనాధికము 
లిందు లేవు..అందరికీ శ్రీహరే అంతరాత్మ!!'' అని ఆనంద తందనాలాడాడు! త్యాగరాజ స్వామీ వారు ఇదే 
భావాన్ని శ్రీ రామునిపరంగా..'' చీమలో, బ్రహ్మలో, శివ కేశవాదులలో ప్రేమమీర చెలగుచుండే బిరుదు 
వహించిన సీతారామ నన్ను బ్రోవ రావేమొకో??'' అని ఆర్తిగా ప్రశ్నించి వెల్లడించారు! బమ్మెర పోతన 
మహానుభావుడు కొన్ని వందల పద్యాలలో ఇదే భావాన్ని వెల్లడించాడు తన ఆంధ్రమహాభాగవతంలో! ఇదే భావాన్ని స్వామి వేవేకానంద ప్రతి మానవునిలో దివ్య చైతన్యం వున్నది..చేయ వలసినది ఆ దివ్యత్వమును అభివ్యక్తీకరించడమే..అని పలికారు! ఒకరని కాదు,యిదీ భారతీయుల సమదృష్టి! యిదీ భారతీయ జ్ఞానదృష్టి! 
సకల ప్రాణులూ, కేవలం సమస్త మానవాళి కాదు,భగవత్స్వరూపాలే భారతీయుల దృష్టిలో!అందుకే రెండుకాళ్ళమానవులకే కాదు..నాలుగు కాళ్ళ జంతువులకు కూడా శుభం, సుఖం,శాంతి కలగాలని వేదం ఆశీర్వదించింది 'శంనో అస్తు ద్విపదే..శం చతుష్పదే..ఓం శాంతి: శాంతి: శాంతి:' అని!


(2)బ్రహ్మైవాహ మిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం
సర్వం చైత దవిద్యయా త్రిగుణయాశేషం మయా కల్పితం 
ఇత్థం యస్య దృఢమతిస్సుఖతరే నిత్యే పరే నిర్మలే 
చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ

బ్రహ్మ మయమిదే ప్రపంచమంతా,
చిన్మయ రూపం ఈ జగమంతా,
'త'న్మయమై అలరారినదంతా! 
తప్పుగ తలచితినేను ఒకింత..
అవిద్యచే, త్రిగుణమ్ముల చేత , 
ప్రపంచమంతా శాశ్వతంబని!
కలయికలన్నీ వీడిపోవును, 
కనపడు సర్వము కదిలి పోవును, 
వినపడు స్వరములు అణగి పోవును! 
బ్రహ్మము చిన్మయమొకటి శాశ్వతం, 
మిగిలిన సర్వము, జగము నశ్వరం!
అని ధృఢముగ తెలిసిన సుఖుడెవరో 
సన్మతి.స్థిరమతి,నిర్మలుడెవరో
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు
మరియాతడె పో.. నా గురుదేవుడు! 


నాలో బ్రహ్మపదార్దమే నిండి వుంది..కంటికి కనిపించే ఈ ప్రపంచమంతా అదే బ్రహ్మ పదార్ధముచేత 
అదే చిన్మాత్ర చేత నిండివుంది..అంటే నేను నశించి పోయినా, కంటికి కనిపించే ఈ ప్రపంచం నశించి 
పోయినా..ఆ అంతర్గర్భితమైన బ్రహ్మ పదార్ధము నశించి పోదు..అది శాశ్వతము! అంటే అది మాత్రమే 
శాశ్వతము! అవిద్యచేత అంటే అజ్ఞానము చేత, సత్త్వ,రజో, తమో గుణములచేత ప్రభావితుడనై
నాతో సహా ఇదంతా అశేషమైనది అని, అనంతమైనది అనీ అంటే అంతం లేనిది, శాశ్వతమైనది అని 
కల్పించుకొన బడినది..అంటే వాస్తవంగా అది నిజం కాదు..అనే దృఢమైన నమ్మకంతో..శాశ్వతమైన, 
సత్యమైన,నిత్యమైన,నిర్మలమైన సుఖాన్ని ఎవరు పొందగలరో వారు జన్మచేత చండాలుడైనా, 
బ్రాహ్మణుడైనా ఎవరైనా సరే,అతనే నా గురుదేవుడు! 

శుక్ల యజుర్వేదం లోని బృహదారణ్యక ఉపనిషత్తు లోని 'అహం బ్రహ్మాస్మి'అనే మహా వాక్యానికి నిర్వచన 
రూపకంగా ఈ రెండవ శ్లోకాన్ని చెప్పారు ఆదిశంకరాచార్యులవారు తమ మనీషాపంచకంలో. బ్రహ్మైవాహం 
అనే ఎత్తుగడతోనే అహం బ్రహ్మాస్మి..అనే మహా వాక్యాన్ని స్పృశించారు. కైలాసంలో పరమశివుడు శుక 
మహర్షికి ఈ మహావాక్యాన్ని ఉపదేశిస్తూ..'' పరిపూర్ణః పరాత్మాస్మిన్దేహే విద్యాధికారిణీ|బుద్దేస్సాక్షితయా 
స్థిత్వాస్ఫురన్నహ మితీర్యతే ''..అన్నాడు.అంటే..పరిపూర్ణుడూ,పరాత్ముడూ ఐన అంటే జీవాత్మకు పరుడు 
ఐన పరమాత్ముడు ఈ దేహంలో వున్నవాడు,విద్యకు అంటే జ్ఞానానికి అధికారిగా బుద్ధిరూపకుడిగా సాక్షిగా వున్నవాడు ఎవరైతే ఉన్నాడో వానినే 'అహం' అని అంటారు అన్నాడు. పరిపూర్ణుడు పరమాత్ముడొక్కడే,ఆ పరిపూర్ణుడే నాలోనూ, ఈ విశ్వమంతటా వున్నాడు..పరిపూర్ణం కాని విశ్వం,నేనూ లేకపోయినా ఈ 
పరిపూర్ణ పరమాత్ముడు మిగిలి ఉంటాడు,కొనసాగుతుంటాడు.'' స్వతః పూర్ణః పరాత్మాత్ర బ్రహ్మ శబ్దేన 
వర్ణితః అస్మీత్యైక్య పరామర్శః తేన బ్రహ్మ భవామ్యహం ''.. సహజంగానే పరిపూర్ణుడు,విద్యాధికారిగా అంటే 
జ్ఞానానికి అధికారిగా, బుద్దిరూపకుడై సాక్షిగా ఈ దేహంలో వున్న ఆబ్రహ్మఅనే శబ్దం ద్వారా వర్ణింపబడిన 
వాడనే నేను అయి వున్నాను అని భావించడం ద్వారా ఆ బ్రహ్మమును అనుభవించడం ద్వారా నేనే 
బ్రహ్మమును అవుతాను,శాశ్వతుడను అవుతాను,అంటే నేను పైకి కనిపించే నేను కాదు,అంతర్గతంగా
వెలుగొందుతున్న ఆ పరమాత్ముడిని,పరిపూర్ణుడైన ఆ పరమాత్ముడి అంశనే నేను,కనుక ఈ శరీరంతో 
వచ్చిన హెచ్చు తగ్గులు,మంచి చెడులు,ఇవి ఈ శరీరంతోనే పోతాయి కానీ లోపలి ఆ పరిపూర్ణ తత్త్వం 
నిలిచి వుంటుంది కనుక నాకు అనగా నా ఆత్మకు నాశనం లేదు, నా దేహానికి మాత్రమే..అనే జ్ఞానం 
కలిగిన వారు జన్మచేతచండాలుడైనా, బ్రాహ్మణుడైనా ఎవరైనా సరే, వారే నా గురుదేవుడు!


(3)శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో:
నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజ శాంతాత్మనా
భూతం భావిచ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే 
ప్రారబ్దాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ


నశించి పోవును ప్రపంచమంతా 
వశించి వుండే వస్తువొక్కటే 
సత్యమైనదిది సద్గురువాక్యం 
నిశ్చయమిదియని నిరంతరంగా
హృదంతరాళములో తలపోస్తూ 
నిరంతరానందము చవి జూస్తూ 
స్వచ్చమైన ఘన జ్ఞాన వహ్నిలో
భూత భవిష్యద్వర్త మానముల 
కర్మఫలములను దహించి వేస్తూ
నిష్కాముకుడై కర్మలుజేస్తూ
నిత్య ముక్తుడౌ నరుడెవడైనా
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు!
మారి యాతడె పో, నా గురుదేవుడు! 

కంటికి కనిపించే ఈ విశ్వమంతా నశించిపోయేదే, విశ్వములోఅంతర్గర్భితంగా వున్న బ్రహ్మతత్త్వమొక్కటే నశించనిది, సత్యమైనది, శాశ్వతమైనది అనే గురు వాక్యములను నిరంతరం మననం జేసుకుంటూ, 
ఏ కారణం లేకుండా శాంతుడై, భూత, భవిష్యద్వర్తమానకాలములకు చెందిన కర్మఫలితములను 
గురువాక్య ప్రబోధంద్వారా కలిగిన జ్ఞానమనే అగ్నిలో దహించివేసి,ప్రారబ్ధ,సంచిత,ఆగామి కర్మఫలితములను 
తాను పొందకుండా నిస్సంగుడై చరించే మానవుడు జన్మచేత చండాలుడైనా,బ్రాహ్మణుడైనా, ఎవరైనా సరే, 
అతనే నా గురుదేవుడు!మనీషా పంచకంలోని ఈ మూడవ శ్లోకంలో '..వాచా గురో..' అనడం ద్వారా 
'గురుదేవుని వాక్యములు అంటే గురుదేవుని ఉపదేశం' అనడంతో పాటు 'మహా వాక్యములు అంటే గురువాక్యములు కనుక మహావాక్య చతుష్టయాన్ని' సూచించారు ఆది శంకరాచార్యులవారు! మహావాక్య
చతుష్టయంలోని మూడవది ఐన 'తత్త్వమసి'కి మనీషా పంచకంలోని ఈ మూడవ శ్లోకం వ్యాఖ్యాన 
పూర్వకంగా వెలయించినది అనడం లో సందేహం అవసరం లేదు. 'తత్త్వమసి' అనే మహావాక్యం సామవేదం 
లోని ఛాందోగ్య ఉపనిషత్తు లోనిది. దీనిని శుకమహర్షికి ఉపదేశిస్తూ,శుకరహస్యోపనిషత్ లో,పరమశివుడు,
'' ఏకమేవాద్వితీయం సన్నామ రూప వివర్జితం| సృష్టే: పురాధునాప్యస్య తాదృక్త్వం తదితీర్యతే '' అన్నాడు. అంటే..తాను మాత్రమే ఒకటిగా వున్నది, రెండవదంటూ ఏదీ లేనిది, తను తప్ప రెండవది ఏదీ లేనిది,
నామ రూపములనే భేదములు లేనిది, నామ రూపములు అంటూ తెలియరానిది, సృష్టికి పూర్వమూ 
ఇప్పుడు కూడా వున్నది, అంటే ఎప్పటికీ వుండేది, నాశనం లేనిది, విమర్శ చేయడం ద్వారా ఇప్పటికీ 
తెలియదగినదీ ఏది కలదో దానినే 'తత్' అంటారు అని అర్థం! అంటే విశ్వములో, అన్నింటా వుండినదీ, వుంటున్నదీ, వుండేదీ ఐన ;బ్రహ్మ తత్త్వం' నాశము లేనిది, కానీ విశ్వమూ,విశ్వములోని సమస్తమూ 
నశించి పోయేవే! ఆది ఒక పేరుతో, ఒక రూపముతో తెలిసికొన గలిగినది కాదు,కనుకనే కేవలం గుర్తుగా 
'అది' అంటే, 'తత్' అని అనబడేది! (యదా నద్యః స్యన్దమానాః సముద్రేస్తం గచ్చంతి నామ రూపే విహాయ|
తథా విద్వాన్ నామ రూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం..ఏ విధంగా రకరకాల పేర్లతో, 
రూపాలతో ప్రవహించే నదులు సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఏ పేరూ, ఏ రూపమూ లేకుండా 
పోతాయో, ఆ విధంగా పండితులు నామ రూపముల భేదములు లేకుండా పరమాత్ముడనే సాగరమును
చేరుకుంటారు అని మరొక ఉపనిషత్ చెప్పింది! ఈ పేర్లూ,రూపాలూ,విధానాలూ కేవలం గుర్తుకోసం మనం కల్పించుకున్నవే..ఏ పేరుతో పిలువబడే నది ఐనా దాహం తీర్చడం, తన జలధారల ద్వారా పండిన 
పంటలచేత ఆకలిని తీర్చడమే చేసేది, ఆధ్యాత్మిక జ్ఞానం ఏ పేరుతో, ఏ మార్గంలో పొందినా ఐహిక 
ప్రపంచపుబాధలు అనే దాహాన్ని,ఆకలిని తీర్చడానికే,యిదీ భారతీయవేదాంత సమన్వయదృష్టి,జ్ఞానవృష్టి!

'తత్త్వమసి' ని బోధిస్తూ, శుక రహస్యోపనిషత్ లో, రెండవ శ్లోకంలో పరమశివుడు..'' శ్రోతుర్దే హేన్ద్రియాతీతం 
వస్త్వత్ర త్వం పదేరితం ఏకదా గ్రాహ్యతేసీతి తదైక్య మనుభూయతాం '' అని'తత్త్వమసి 'మహావాక్యాన్ని
వివరించి ఉపదేశించాడు! అంటే..నామము ద్వారా పలకడానికీ, రూపంద్వారా చూడడానికీ సాధ్యం కానిది 
అని చెప్పబడిన 'తత్' అనబడిన 'అది' శ్రోత్రము ద్వారా అంటే వినికిడి ద్వారా కూడాతెలియబడనిది,
ఇంతవరకూ మూడు ఇంద్రియముల ద్వారా తెలియబడనిది  (మూడు అంటే సమస్తం అని న్యాయశాస్త్రం 
కనుకనే ఎన్నిసారులు ఆచమించాలి అంటే మూడుసార్లు అంటే అనేక మార్లు, ఎన్ని ప్రదక్షిణలు అంటే 
మూడు,ఎన్ని నమస్సులు అంటే మూడుసార్లు నమస్కారాలు..అని నిర్దేశించింది!) అంటే సకల ఇంద్రియములద్వారా తెలియబడనిది..పంచ కర్మేంద్రియముల ద్వారా,పంచ జ్ఞానేంద్రియముల ద్వారా
కూడా సంపూర్ణంగా తెలియబడనిది,వస్తుతః 'త్వం' పదముచేత తెలియదగినది..త్వం అంటే నీవు కనుక 
ఆ పైన వివరించిన లక్షణములను కలిగిన 'బ్రహ్మ పదార్దమే' నీవు కనుక,ఎందుకంటే 'చతుర్ముఖ బ్రహ్మ
ఇతర దేవతలు మొదలుకొని సమస్త జీవరాశులలోనూ నిండి వున్నది అదే కనుక'(ప్రజ్ఞానం బ్రహ్మ,అహం బ్రహ్మాస్మి ప్రకారం)ఆ పదార్దమే 'త్వం' అంటే నీవు కనుక అదే నీవు..ఆ బ్రహ్మపదార్దమే నీవు..నీవు 
దేవుడవే.. నీవు అమరుడవే..అమృత పుత్రుడవే..అనే భావాన్ని 'అసి', అంటే, అయి వున్నాను అని 
అర్థం కనుక,అదే నీవు అయి వున్నావు అనే సత్యాన్ని విమర్శించి,తెలిసికొని,ఆ బ్రహ్మైక్య భావాన్ని 
పొందవలెను! దేహము, విశ్వము నశించి పోయేవే కానీ,దేహములోని, విశ్వములోని దైవం నశించిపోనిది  
కనుక, దేహము ద్వారా చేసే కర్మలద్వారా వచ్చే ఫలితములను అంటకుండా, అంటే ఆ ఫలితములను ఆశించకుండా,ఏ కారణమూలేకుండా,అంటే చేసేదీ నీవు కానప్పుడు,చేయించేదీ నీవు కానప్పుడు, ఆ ఫలితములూ నీవి కానప్పుడు ఇక ఏ కారణం వుంటుంది కనుక?

(వేదాంత ప్రపంచంలో తత్త్వమసి అనే మహావాక్యాన్ని ఉపదేశ వాక్యం అన్నారు..ఈ భావాన్నే ఉపదేశ 
రూపకంగా శ్రీకృష్ణుడు అర్జునునితో..'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ: 
మాతే సంగోస్త్వ కర్మణి ' కర్మములు చేయుటయందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితములందు 
లేదు, నీవు కర్మ ఫలితములకు కారణము కారాదు..అట్లని కర్మలు చేయుట మాన రాదుఅని ' 
ఉపదేశించాడు!) కనుక..ఈ జ్ఞానము ద్వారా సంక్రమించిన జ్ఞానమనే అగ్నిలో ప్రారబ్ధ,సంచిత,ఆగామి 
కర్మ ఫలితములను నిరంతరం గురువాక్యములద్వారా సంప్రాప్తించిన జ్ఞానమనే అగ్నిలో దహించి, ఏదీ 
నీది కాదనే, ఏదీ నిలిచిపోదనే, ఏదీ వెంట రాదనే సత్యం 'అనుభవంలోకి వచ్చిన తర్వాత' మిగిలేది ఏ 
కదలికలూ, కల్లోలాలూ లేని ప్రశాంతతే కనుక, ఆ అనుభవం పొందిన,శాంతాత్ముడై వుండే మహానుభావుడు జన్మచేత చండాలుడైనా,బ్రాహ్మణుడైనా, ఎవరైనా సరే..ఆయనే నా గురుదేవుడు!..అన్నాడు 
ఆదిశంకర గురుదేవుడు!

(4)యా తిర్యన్నర దేవతాభి రహమిత్యంత స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్ష దేహ విషయాభాంతి స్వతో చేతనా
తాం భాస్యై: పిహితార్క మండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్
యోగీ నిర్వృత మానసోహి గురురిత్యేషా మనీషా మమ 


ఏ కళ వెలుగై కదలు వాటిలో
వృక్ష జాలముల, జంతు కోటిలో
మానవులందు, దేవతలందు
దృశ్యమానమై వెలుగుచున్నదో
హృదయ కుహరమున వెలిగేనేకళ
ప్రాణి కోటికిల ప్రాణమైన కళ 
తన వెలుగునుగొని జీవులు కళకళ
లాడుచుండునో సాగుచుండునో
ఆ వెలుగారిన ఆగుచుండునో
ఆ వెలుగుల గని వెలిగించునది
వెలుగు వానిలో కనిపించునది
జీవకోటికా వెలుతురొక్కటే
జీవులన్నిటా వెలుగునొక్కడే 
అని తెలిసిన మానవుడెవరైనా
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు!
మరి యాతడె పో, నా గురుదేవుడు! 

కదిలే వానిలో(తిర్యక్కులలో),మానవులలో,దేవతలలో..అందరిలో అన్నింటాస్ఫుటంగా స్పష్టముగా 
కనిపించునది, గ్రహింపబడునది,ఏ కళ హృదయకుహరములో వెలుగొందడం వలన స్వతహాగా కళ,చైతన్యం,కదలిక లేనివి కళ, చైతన్యం,కదలిక వున్నవానిలాగా కనిపిస్తాయో, ఏ వెలుగు 
అంతర్గతంగా వెలుగొందుతుండడం వలన పైకి కనిపించే శరీరాలు, జీవులు ఆ వెలుగును ఆ కళను (ప్రాణకళ,జీవకళ)ను కలిగిఉన్నట్లుగా కనిపిస్తాయో ఆ కళను,ఆ వెలుగును,ఆ చైతన్యము సత్యము, 
నిత్యము, శాశ్వతము అని తెలిసికొన్న మహానుభావుడు,నిరంతరమూ ఆ స్ఫూర్తిని,ఆ సత్యమును,
నిత్యమును, శాశ్వతమును మననం చేసే మహానుభావుడు జన్మచేత చండాలుడైనా, బ్రాహ్మణుడైనా 
ఎవరైనా సరే, ఆయనే నా గురుదేవుడు, నా దృష్టిలో మహానుభావుడు!మనీషాపంచకం లోని ఈ
నాలుగవ శ్లోకం అధర్వణ వేదంలోని మాండూక్య ఉపనిషతు లోని 'అయమాత్మా బ్రహ్మ' అనే 
మహావాక్యానికి వ్యాఖ్యాన పూర్వకమైనది!పరమశివుడు శుకమహర్షికి ఈ మహావాక్యాన్ని ఉపదేశిస్తూ..

'' స్వప్రకాశాపరోక్షత్వం ఆయమిత్యుక్తితోమతం| అహంకారాది దేహాంతం ప్రత్యగాత్మేతి గీయతే 'అన్నాడు, 
అంటే స్వప్రకాశమైనది,తనే తనంతగా వెలిగేది,ఎక్కడినుండో తెచ్చుకున్నవెలుగుతో వెలిగేది కానిది,తనే 
వెలుగుతూ వెలిగించేది..అపరోక్షం అంటే పరోక్షంకానిది.. అంటే ప్రత్యక్షమైనది..'అయం''ఇది' అనబడేది 
'అహంకారం' మొదలైన వాటికీ భిన్నమైనది..ఆది ప్రత్యగాత్మ అనబడుతుంది..పరమశివుడు ఇంకా..
'దృశ్యమానస్య సర్వస్య జగతత్తత్త్వ మీర్యతే|బ్రహ్మ శబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మ రూపకం'..అన్నాడు..
అంటే కంటికి కనిపించే సర్వజగమూ ఆ బ్రహ్మ పదార్ధముచేత, అంటే ఆ ప్రత్యగాత్మ చేత నిండి వున్నది. 
ఆ బ్రహ్మ పదార్ధము, ఆ ప్రత్యగాత్మ స్వప్రకాశమైనది,అంటే అదే నిజమైన వెలుగు,ఆ వెలుగే మిగిలినవన్నీ వెలిగేటట్లుగా చేస్తుంది, వాటిలో అంతర్గతంగా తాను వెలగడం ద్వారా..ఈ వెలుగు ఉన్నంత కాలమే అవి
వెలుగుతున్నట్లుగా కనిపిస్తాయి..సూర్యుని వెలుగును చంద్రుడు,నక్షత్ర గ్రహ గణాలు గ్రహించి వెలుగుతున్నట్లుగా,విద్యుత్తు గ్రహించి విద్యుద్దీపాలు వెలుగుతున్నట్లుగా,కనుక ఆ శాశ్వతమైన వెలుగును గుర్తించి,గుర్తుంచుకుంటూ,నిరంతరం మననం చేసే మహానుభావుడు ఎవరైనా సరే అతనే నా గురుదేవుడు!
ప్రాణుల శరీరాలలో ఆ వెలుగు ప్రాణ శక్తిగా ఉన్నంత వరకే ప్రాణులు కళ కళ లాడుతూ వుంటాయి,ఆ కళ
తప్పితే కట్టెలవుతాయి. కనుక శరీరాలూ,శరీరుధారులూ శాశ్వతులు కారు..ఆ శరీరాలలోసమానంగా 
వెలుగొందే ప్రత్యగాత్మఐన బ్రహ్మపదార్ధమే శాశ్వతం,కనుక శరీరానికి కాదు,శరీరికి,అంటే లోపలి వెలుగుకి ప్రాధాన్యత నిచ్చేవాడూ, ఆ లోపలి వెలుగు అందరిలోనూ,అన్నింటిలోనూ సమానంగా వున్నది కనుక,
అందరూ, అన్నీ సమానమే అని భావించేవాడు, శాశ్వతమైన దాన్నిగుర్తించి నిరంతరం స్మరించే వాడూ 
ఎవరో అతనే నా గురుదేవుడు!

(5)యత్సౌ ఖ్యామ్బుధి లేశ లేశత ఇమే శక్రాదయో నిర్వ్రుతా
యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్వ్రుత
యస్మిన్ నిత్య సుఖామ్బుధౌ కలిత ధీర్బ్ర హ్మైవ న బ్రహ్మవిత్
యః కశ్చిత్ ససురేంద్ర వందిత పదో నూనం మనీషా మమ 


ఏ సుఖ సాగర చిరు బిందువుగా
దేవేంద్రాదులు సంతసింతురో
చిత్తమునందే లేశమైన సుఖ
భావము పొందిన మునులానందింతురొ
ఆనందమిది అనుభవమిది యని 
ఎరుగక అద్వైతానుభావమున
ఆనందమె తామై తాముందురొ 
ఆ బ్రహ్మానందాంబుధి మునిగిన
బ్రహ్మానందమె తానై మిగిలిన 
అద్వైతామృత విందులందిన 
నరుడే సుర,ముని,బుధ వందితుడు, 
కులము,మతము,జాతేదైనా,
మనుజులలో నడయాడే దేవుడు!
మరి యాతడె పో, నా గురుదేవుడు! 

ఏ ఆనంద సాగరపు లేశమైనా పొందినందుకు దేవేంద్రాదులు కూడా తరించి పోతారో,కేవలం దేనిని 
మాత్రమే మనసులో పొందినందుకు మహా మునులు కూడా తరించిపోతారోయే నిత్యమైన శాశ్వతమైన 
ఆనంద సాగర అనుభవం చేత అనుభవించేవాడూ, ఆ అనుభవమూ ఏకమైపోతారో,అంటే అనుభవించేవాడు 
తనే ఆ అనుభవమై పోతాడో..అటువంటి ఆ అద్వైతానుభవ ఆనంద సాగరమును చవిజుసిన వాడూ.. దేవేంద్రాదులచేత కూడా నమస్కరింప బడిన పాదపద్మములు గల ఆ మహానుభావుడే నా గురుదేవుడు! 
ఆది శంకరాచార్యులవారు ఇంతవరకూ శుక రహస్యోపనిషత్తుకు వ్యాఖ్యాన పూర్వకంగా చెప్పిన మనీషా పంచకంలోని చివరి ఐదవ శ్లోకం ఇది. ఈ స్తోత్ర ఫల శ్రుతిగా, శుక రహస్యోపనిషత్తుకు ఫలశ్రుతిగా, ఈ 
రెండింటిని తెలిసికొని,ఆచరించి, అనుభవించిన ఆనందానికి ఫల శ్రుతిగా ఈ చివరి శ్లోకాన్ని చెప్పారు!శుక రహస్యోపనిషత్తు చివరిలో, పరమ శివుడు తనకు నాలుగు మహావాక్యములను ఉపాసనా మార్గంలో 
ఉపదేశించిన తర్వాత, ఆ మహావాక్య అనుభవ సారమనే ఆనంద సాగరంలోఈదులాడుతున్న వానివలె, పరమేశ్వరునకు నమస్కరించి అక్కడినుండి స్వేచ్చగా వెళ్ళిపోయాడు అని శుకరహస్యోపనిషత్తు 
ముగింపు జరుగుతుంది..ఇక్కడ అదే భావాన్ని వ్యక్తం చేసిన ఆది శంకరాచార్యులవారు మహావాక్య 
చతుష్టయాన్ని, వాటిని ఉపదేశించిన శుకరహస్యోపనిషత్తునూ,ఆ ఉపనిషత్తుకు వ్యాఖ్యానపూర్వకంగా 
చెప్పిన మనీషా పంచక స్తోత్రమునూ పఠించిన, అవగతం చేసుకున్న,అనుభవించిన ఫలితము ఏమిటో
ఫలశ్రుతిగా ఈ చివరి శ్లోకంలో చెప్పారు!మనీషా పంచకమును ఎందరో మహానుభావులు,జగద్గురువులు,
గురుతుల్యులు, పండితులు,పూర్వం వ్యాఖ్యానించి వున్నారు. వారి ప్రజ్ఞలో ఆవగింజలో అరవయ్యవ 
వంతు కూడా లేని అల్పుడిని అజ్ఞానిని ఐన నేను నా అదృష్టకారణంగా, ఆదిశంకరుల మీద నాకున్న 
కేవల భక్తి భావ విశేషం చేత,ఆ గురుదేవుని కృపచేత,శుకరహస్యోపనిషత్తుకు అనువాదపుర్వకమా
అన్నంత సారూప్యాన్ని, సామీప్యాన్నిమనీషా పంచకం కలిగివుందని తెలిసికొన్న కారణంగా, ఆ 
సారూప్యాన్ని, పోలికలను బయటకుతెచ్చేఉద్దేశంతో, ఆదిశంకరుని పలుకులు ఉపనిషత్తుల మందాకినీ
కులుకులు అని మరొక దృష్టాంతం పాఠకుల దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ చిన్ని ప్రయత్నమును 
చేయడం జరిగింది.


మనీషా పంచాకములోని ఐదు శ్లోకాలకూ ఈ వ్యాసంలో ఇచ్చిన అనువాద గేయాలు నేను రచించినవి. 
కారణం.. మనీషాపంచకం మీది ప్రేమ,సంస్కృతం లోని ఆ శ్లోకాలను తెలుగులో సరళంగా సులభంగా 
అర్థం చేసుకోవడానికి సహకారంగా వుంటాయి అని. ఈ దీర్ఘ వ్యాసంలో ఏవైనా దోషాలుంటే పాఠకులు మన్నింతురుగాక! తన స్తోత్ర ఫలముగా గురుదేవుడు ప్రవచించిన మానసిక ప్రశాంతత నాకూ..నాలాంటి 
ఎందరో సామాన్య జనులకు లభించునుగాక! ఆదిశంకర దివ్య వాణి అనంతకాలములందు అవనిలో ప్రతిధ్వనించును గాక!


ఓం తత్ సత్!!! ఓం శాంతి:శాంతి:శాంతి: