పిజ్జకాయలు!!

Welcome to My Blog friends!

Monday, June 25, 2012



12 వ రంగము 
(శ్రీకృష్ణ దేవ రాయలు, తిరుమల దేవి, అప్పాజీ, భువనవిజయ కవులు, యితర 
ముఖ్యులు.)
రాయలు:- యిది..
       కం.  అంభోధికన్యకా కుచ   
              కుంభోంభిత ఘుసృణ మసృణ గురువక్షునకున్
              జంభారి ముఖాధ్యక్షున 
             కంభోజాక్షునకు సామి హర్యక్షునకున్ 
             ...అంకితముగా ఆయలమేలుమంగాపతి నాచే పలికించిన 
            ఆముక్తమాల్యదా గ్రంథములోని హృద్యంబైన పద్యంబుల యారవ 
           యాశ్వాసము..సకలమూ సంపూర్ణము! శ్రీ వేంకటేశార్పణమస్తు!
(ఎల్లరూ కరతాళ ధ్వనులతో హర్షమును వ్యక్తము జేయుదురు)
పెద్దన:- భళీ శ్రీకృష్ణ దేవరాయా! నేడు ఆంధ్ర సాహిత్య సరస్వతి యానంద 
          తాండవము జేసినది! ఇంతటి కవిరాజుచేత కాలికి గండపెండేరము, 
          కనకమణిమయ  పల్యంకికారోహణమూ పొందిన నాయంతటి 
          అదృష్టవంతుడు ఆంధ్రసాహిత్య  చరిత్రలోనే వుండబోడు!
రామకృష్ణ:- శ్రీరంగనియంతరంగము నేడు తృప్తినందినది! రంగనాధుని 
               భక్త పరాధీనతను కరుణను ఎంత అద్భుతముగా 
               చిత్రీకరించినావయ్యా! కవిరాజువైన నీవు మా రాజువు కావడం 
               విజయనగర సామ్రాజ్య ప్రజల సుకృతం! 
సూరన:- మత్స్యధ్వజుని రక్తి, విరక్తి, చివరకు విష్ణుసేవయందు అనురక్తిని 
            గొప్పగా పోషించి..కొద్దిలోనే ఎంతటి పరిపూర్ణమైన పాత్రగా 
            తీర్చిదిద్దినావయ్యా! గోదాగోవిందుల ప్రణయబంధము సరసపద
            బంధమై..ఆముక్తమాల్యదా ప్రబంధమైనది! 
అప్పాజీ:- చిరంజీవీ! కృష్ణరాయా! ఆంధ్ర భోజా! ఏమని వర్ణింపగలనయ్యా! 
             మానవులలో అదృష్టవంతులంటే నీ ఏలుబడిలో మనగలిగిన వారే!
             రాబోయే తరములలో కవిపండితులు..తాము నీ కాలమున 
             పుట్టివుంటే..ఎంత బావుండెడిదో..యని పలవరింతురేమో!  
పెద్దన:- భువనవిజయ కవులు  శ్రీకృష్ణదేవరాయ కవిచంద్రునకు ఆ చంద్రునికి 
          ఒక నూలుపోగువలె..ఒక చిన్ని సమర్పణము జేయవలయునని  
          కుతూహలపడుచున్నారు! ఏలినవారు అనుమతింపవలె!
రాయలు:- ఏమది?
పెద్దన:- సువర్ణ ఘంటా కంకణ ప్రదానము
రామకృష్ణ:- సాహితీ సమరాంగణసార్వభౌమ బిరుదు ప్రదానము!
తిమ్మన:- కదనకవితాకంఠీరవ బిరుదు ప్రదానము!
రాయలు:-(చిరునవ్వుతో,పరిహాసముగా)మామగారూ!ఒకటే చిన్ని సమర్పణ
             యంటిరే..ఇన్ని సమర్పణములా ?   
పెద్దన:- సత్యభంగము కాలేదు ప్రభూ..ఒక్కొక్కరిదీ ఒక్కొక్క చిన్ని సమర్పణయే  
           కదా! అలా అన్వయించుకొందము!

(శిష్య సమేతుడై వ్యాస రాయల ప్రవేశము. అందరూ లేచి నిల్చుని నమస్కరింతురు!)

వ్యాస:- ఎల్లరికీ శుభమస్తు!..భువన విజయ కవుల కోరిక సమంజసమే చిరంజీవీ! 
          నేటి ఉదయమే అశుభగ్రహయోగము తొలిగిపోయినది! మరలా 
          విజయనగర సామ్రాజ్య లక్ష్మీకర గ్రహణమునకూ, కదనరంగములోనూ 
          కవనరంగములోనూ నీ ప్రతిభకు నీరాజనముగా ఈ బిరుదుల 
          గ్రహణమునకూ వేళయైనది! శ్రీకృష్ణదేవరాయల వైభవమును వేనోళ్ళ  
          పొగడవలసిన  శుభసమయమేతెంచినది!

(ఎల్లరూ హర్షధ్వానములు జేతురు! వ్యాసరాయల చేతులమీదుగా 
రాజలాంఛనములను స్వీకరించిన రాయలకు మహాకవులచేత  ఘన
సత్కారము జరుగును.ఒక్కొక్కరు సత్కరించి తాము ప్రదానము జేసిన 
బిరుదులను జయ జయ ధ్వానములచేత  పలికింతురు. 
రాజనర్తకీమణులు నృత్యగానము జేతురు)

ప.     జయహో శ్రీ కృష్ణ దేవ రాయ!
        జయ నిత్య కీర్తి కాయా!

ఆ.ప  జయ కదన కవన రవి చంద్ర  తేజ
        జయ భువన విజయమున ఆంధ్ర భోజ .. 

చ.     నీ తనువు  కదన ఘన విజయలక్ష్మికి
         నీ మనువు కవనమున విజయలక్ష్మికి 
         తను వృత్తి నీకు సామ్రాజ్య రక్షణం
         నీ ప్రవృత్తి సాహిత్య వీక్షణం..

చ.     చిన రాణి తాను సామ్రాజ్య లక్ష్మీ
        పెద్ద రాణి నీకు సాహిత్య లక్ష్మీ
        చిన్నమ్మ తోడి చిరకాల చెలిమి
        పెదరాణి తోడి కల కాల కలిమి..

చ.     నడివీధిలోన రతనాలు  రాశి
        నడి రేయి దాక కవనాలు  దూసి
        పడి కరకు తురక తలచెండ్లు కోసి
        కడలేని కీర్తిగనినావు వాసి... 

చ.     గజపతుల కైన ఘన స్వప్న సింహమా!
        మదవతులకైన శృంగార చిహ్నమా!
        కవితా వధూటి సిగపువ్వు చంద్రమా!
        తులలేని అలల సాహిత్య సంద్రమా!

చ        ఘన  తెలుగు కవన ధారా విపంచి
        పలికించి తేనెలొలికించి   మించి
        వలపించి చూడిక్కుడుత్తనాచ్చి
        నేలించినావు రంగేశుకిచ్చి...

చ.    భువి రాజులెందు?  శాసనములందు!
        కవిరాజులెందు? ఉచ్చ్వాసమందు, 
        జన జీవ నాడి నిశ్వాసమందు!
        నిలిచుండురందు, నువు..  గుండెలందు!

చ.     బ్రహ్మాండమందు శ్రీ వేంకటాద్రి,
        దైవతములందు శ్రీ వేంకటేశుడు,
        పలు దేశభాషలను తెలుగు లెస్సరా!
        రాజులందు..రాయ! నువు లెస్సరా!


(ఎల్లరూ జయజయ ధ్వానములు జేయుచుండగా తెర వాలును)

* స్వస్తి *
******

( శ్రీకృష్ణ దేవరాయల ఆముక్తమాల్యదా గ్రంధమును ఒక దృశ్య కావ్యముగా అందించ 
వలెననే కోరికతో ఈ చిరుప్రయత్నము చేశాను. రాయలవారి పద్య భాషకు తగినట్లు 
వచనం లేకుంటే చిరుగుల బొంతకు మాసికలు వేసినట్లు వుంటుంది. అలా అని 
గద్యము సరళముగా లేకుంటే  ప్రదర్శనా యోగ్యత  లోపిస్తుంది. నా పరిధిలో ఒక 
మధ్యే మార్గంలో పోవడానికి ప్రయత్నించాను. ప్రదర్శనా సౌలభ్యాన్ని సాధ్యమైనంత 
వరకూ పాటిస్తూనే రాయల  సాహిత్య విలువ నిలబెట్టడానికి, సంభాషణ లలోనూ, 
సన్నివేశాల రూపకల్పనలోనూ మూలానికి వ్యాఖ్యాన  పూర్వకంగా ఉంచడానికి, 
ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల  వ్యక్తిత్వాన్ని దర్శిమ్పజేయడానికి, ఆయన 
సంభాషణల ద్వారా, నా శాయశక్తులా ప్రయత్నం చేశాను. ఈ  నాటకాన్ని యథాతథం
గానూ మాలదాసరి సన్నివేశం వరకే లఘు నాటికగానూ మా 'మధిర రంగస్థల 
కళాకారుల సమాఖ్య ద్వారా అనేక ప్రదర్శనలు చేశాము. లఘు నాటికకు మాలదాసరి 
పాత్రకు బహుమతులు లభించాయి. శ్రీకృష్ణ దేవరాయల  పంచశతాబ్ది  ఉత్సవాల  
సందర్భంగా పూర్తి నాటకాన్ని ఖమ్మంలోనూ, జమలాపురంలోనూ రాష్ట్ర ప్రభుత్వ  
ఆహ్వానం మేరకు ప్రదర్శించి రాయలసేవ మా శక్తి కొలదీ చేశాము! ఆకాశవాణి కొత్తగూడెం 
వారు ఈ నాటకాన్ని మొత్తాన్ని ప్రసారం చేశారు. తెలుగులో పంచ మహా కావ్యాలు ఐన 
వాటిలో మిగిలినవాటికి కూడా నాటక రూపాన్ని ఇవ్వాలని నా కోరిక! అమ్మదయ 
వుంటే నెరవేరుతుంది! ఇందులో రాయల వారి పద్యాలను  మణిపూసలు ఐనవాటిని 
ఇచ్చాను..నేను రాసినవి మాత్రం రెండు పద్యాలు..గోదాదేవి, చెలికత్తెల సన్నివేశంలోని 
'' లీలా నాటక సూత్రధారి '' అనేది, మాలదాసరి సన్నివేశం లోని '' భూషణమౌను సత్య 
దయ పూత  గుణంబులు..'' అనేవి ఆ రెండు పద్యాలు. పాటలు అన్నీ నేను రాసినవి, 
మా ప్రదర్శనలలో పాటలవరకూ ట్యూన్స్  కూడా నేను చేసినవే, ప్రాథమికంగా! 
రాయలవారి పద్యం ' నీలమేఘము డాలు డీలు చేయగ జాలు' అనే దానిలో మాత్రం 
సందర్భాన్ని బట్టి ఒక చిన్న మార్పుతో వాడుకున్నాను. '' మదంధ్ర జలజాక్షుడిట్లని యానతిచ్చె..''అనేది రాయలవారి పద్య పాదం లోని భాగమైతే, '' మదంధ్ర  జలజాక్షు
డిట్లిట  కెట్టులొచ్చే'' అని సన్నివేశపు  అవసరాల మేరకు మార్చాను, రాయలవారి 
పవిత్ర ఆత్మ,  సాహితీ ప్రియులు నన్ను మన్నింతురు గాక! మూలంలోని వివరాలను 
ఏమాత్రం మార్చకపోవడమే కాదు, చారిత్రక పరంగా కూడా ఇందులో చూపించినవన్నీ 
సత్యాలే! రాయలవారికి జాతక రీత్యా దుష్ట గ్రహయోగం సంప్రాప్తించి నట్లు ఉపశమనాలు 
చేసుకున్నట్లు ఉన్నది , దాన్ని జ్యోతిష శాస్త్ర   చిరు పరిచయంతో సాహిత్య వ్యాసంగానికి 
ఆయన వాడుకున్నట్లు కల్పన చేయడం జరిగింది. ఆ సందర్భంలో చెప్పిన మంత్ర శ్లోకం 
'' నమః శంభో త్రినేత్రాయ  రుద్రాయ వరదాయచ..'' అనేది శుభ స్వప్న ప్రాప్తి కొరకు 
జ్యోతిష  శాస్త్ర  ప్రామాణికమైన శ్లోకమే! దీనిని ఆదరించిన, అభినందించిన వారికీ, 
భవిష్యత్తులో ఆదరించగల వారికీ శ్రీకాకుళాంధ్ర  మహావిష్ణు ప్రసాదంగా  శుభములు 
కలుగు గాక! నాకు ఆ సర్వేశ్వరుడు చిత్త శాంతిని, తన పద పద్మములయందు 
అచంచలమైన భక్తీ విశ్వాసాలనూ కలిగించి తన కరుణ చేత  నాకు లభించినవి సద్గుణాలు 
ఏవైనా వుంటే వర్ధిల్ల  జేయుగాక! పురాకృత  దుష్కృత  ఫలితములైన  దుర్గుణ జాలము  
నశించి అయన  పరిపూర్ణ కృపకు నేను పాత్రుడ  నవుదును గాక! యిందులో మొదటి 
సన్నివేశంలో అల్లసానిపెద్దన పలికిన 'మాన్దాతాచ మహీపతి:..'అనే శ్లోకము భోజ
మహారాజు తనను చంపించాలని చూసిన తన పినతండ్రికి రాసిన  లేఖలోనిది అని 
ఐతిహ్యం! పోతన తెలుగులోనూ..ఆదిశంకరుడు సంస్కృతంలోనూ నాకు దైవ 
సమానులు, వీరి పద్యమూ శ్లోకమూ లేకుండా రాయడం, మాట్లాడ్డం నాకు కఠిన 
శిక్షతో సమానం..కనుక  'కారే రాజులు ..' అనే పోతన వారి పద్యాన్ని, 'జాగ్రుత్స్వప్న 
సుషుప్తిషు..' అనే మనీషా పంచకంలోని ఆదిశంకరుల  శ్లోకాన్ని ఉపయోగించుకున్నాను. 
దీనిలో ఏదైనా విలువ వున్నా, లేకున్నా అది అమ్మ దయ, లేక, దాని కొరత, అంతే! నేను అల్పుడిని..ధన్యవాదాలు!)              


      











11 వ రంగము

( శ్రీరంగ మందు రంగ మండపము. సర్వాలంకార భూషితయైన గోదాదేవిని పార్వతీ
 సరస్వతులు తోడ్కొనిరాగా బ్రహ్మ, రుద్ర, ఇంద్రాదులచేత కొలువుదీరిన సభలో 
పెండ్లి పీటల మీద కూర్చునియున్న రంగనాధునికి గోదాదేవితో పరిణయము 
జరుగును. నారద తుంబురులు, యితర రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి గణములెల్ల 
ఆనంద పరవశులు అగుచుండగా స్వామి గోదాదేవిని స్వీకరించును. నాగావళి, 
ఏకావళి, హారిణి, స్రగ్విణి, మనోజ్ఞలు పరివేష్టించి యుండగా నూతన దంపతులకు 
మంగళహారతులిడుదురు. మాలదాసరి పరవశించి గానము జేయును )

ప.     శ్రీదేవి మధు మోవి మరిగేటి తేటి 
        కస్తూరి రంగని కమరు మంగళం  
ఆ.ప. లోకాల నేలేటి నీలాల నిధి మేటి 
        కావేటి రాయనికి కడు మంగళం      ||శ్రీదేవి||
చ.    మత్స్యావతారుడై మనువునేలిన విభుడు
        తాబేటి రాయడై కొండ మోసిన ఘనుడు
       సూకరాకారుడై వసుధనేలిన వరుడు
        సింగంబు మోముతో శిశులగాచే ఘనుడు||శ్రీదేవి||
చ.    పొట్టి వడుగై బలుని తలను ద్రొక్కిన తండ్రి
        తగవైన పగవారి తలలు జెండిన మొండి
        జగములేలిన జెట్టి జానకీ రాముడు
        మనసుదోచిన మరుడు మన్నారుకృష్ణుడు ||శ్రీదేవి||      
చ.    కరుణబోధలసుధల వసుధబ్రోచిన బుధుడు
       కల్కియై రానున్న మాయావిబుధుడు 
       పదిరూపముల తనను పాడేటివారి
       పరికించి పాపముల నడగించు శౌరి  ||శ్రీదేవి||

విష్ణుచిత్త:- తండ్రీ! రంగ నాధా! గోదానాధా! నా పురాకృత సుకృతంగా నా పట్టిని 
              చేపట్టి రంగనాధుని  మామగారనే ఘన కీర్తిని నాకు కట్టబెట్టావా 
              జగన్నాధా!
         తే. విదిగృహాక్షయ విత్తసేవధికి శరణు
             చిరుకృతేక్ష్వాకు పుణ్య రాశికిని ప్రణుతి   
             ధనపతి భ్రాతృ కులదేవతకు జోహారు
             నత మృడాదిక సుమనస్సునకు నమస్సు 

స్వామి:- విష్ణుచిత్తా! శ్రీవైష్ణవ తత్త్వమును ప్రకటించిన భక్తునిగా శ్రీదేవిని కూతురిగా 
            శ్రీరంగనాధుని అల్లునిగా పొందిన మాన్యునిగా నీ విజయము నిత్యమై 
            నిగుడు గాక! నీ చరితమును, నా ఈ పరిణయ గాధను పలికిన, వినిన 
            నరులు భవ బంధములకు లొంగక, శాశ్వతమైన నా దివ్య పదమును 
            పొందెదరు గాక! చతుర్భద్ర మస్తు! సర్వమంగళమస్తు!
(ఎల్లరు అంజలి ఘటియించుచుండగా..వీడలేక..వీడలేక..తండ్రిని వీడుచూ..గోదాదేవి 
రంగనాధుని కరమును బట్టి..యిరువురూ శ్రీరంగని మూలవిగ్రహమునందు 
అద్రుశ్యులైపోదురు!!!)   
   
(తెర)

Sunday, June 24, 2012



10 వ రంగము

(గానము జేయుచూ మాలదాసరి ప్రవేశము)

ప.    రంగని వారము మేము 
        సిరులకు పొంగెడు వారము కాము 
అ.ప. మంగళాంగునకు మరిగిన మేము
         మరునకు  లొంగెడివారము కాము   ||రంగని||
చ.    అంగజు గెలిచే అసురుల నణిచే 
        సింగపు నడుమున చేయిడి నిలిచే
        రంగుల కత్తురి నామపు హంగుల
        సింగారపు ఘన శ్రీ శుభాంగుడా         ||రంగని|| 
చ.    అంగరంగ వైభోగపు సేవల
        అంతరంగ సంయోగపు దోవల
        తుంగభద్ర కావేరీ తటముల 
        రంగుమీర కొలువైన మేటి శ్రీ          ||రంగని||       
(పరవశించి గానము జేయుచూ అరణ్యమధ్యమున ప్రవేశించును)
దాసరి:- శ్రీ రంగా..నీ సేవలో రాత్రీ పగలూ తేడా తెలియకుండా పోతోందయ్యా! 
          ఇంతలోనే తెల్లారబోతోంది! హబ్బా..ఏవిటీ వింత? ఎంతగా నడిచినా 
          అంతకంతకూ దారి పెరుగుతోందా ఏమిటి ఈరోజు?ఛీ..ఛీ..ఏమిటీ 
          పాడువాసన? పీనుగుల వాసన! రంగనాధా! దారి తప్పానా దేవుడా!..
          తెల్లారకముందే నీ కోవెలకు చేరుకోగలనా తండ్రీ? నేను చేరుకోకుంటే 
          నీకు మేలుకొలుపులెవరు పాడాలి?
          (ఒక మహా వటవృక్షమును సమీపించి ఆగి అటునిటూ చూచుచుండగా 
          వికటాట్టహాసము జేయుచూ చెట్టుపైనుండి భయంకరాకారుడైన 
          బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమౌను)
బ్ర.రా:-  ఓసోసి..చండీ!..ముండీ!..శంఖిణీ! ..చిత్తిణీ!..ఎక్కడ చచ్చినారే..
          తిండి దొరికింది రండే! ఓరోరి..పారిపోకు..ఓరి బక్క మనిషీ..ఒక్క 
          పంటికిందికి చాలవు కదరా!  అంతంత పెద్దగా పాడుకుంటూ వస్తుంటే 
          ఎంత బలిసిన ఆహారమో అనుకుంటినే ..ఎక్కువసేపు పట్టదు! ఒక్క 
          దెబ్బకు నిన్ను చంపి ఒరుగును నమిలినట్టు నములుతా!
దాసరి:- (వీణ, చిరుతలు కింద బెట్టి నడుమునుంచి కత్తిని దీసి..అడుగులేస్తూ..) 
           అలాగేం?..అదీ చూద్దాం! రంగదాసుని..నాకేం భయం? ఎవరినీ 
           పిలిచావు సాయానికి? రమ్మను.
(ఒక చేతితో కత్తిని బట్టుకుని పిడికిలి బిగించి యుద్ధమునకు సిద్ధమగును)
బ్ర.రా:- ఎవరినా..నా పెళ్ళాలను నలుగురిని..సాయంకోసం కాదు..సంబరం 
          చేసుకోడం కోసం! ఒరె..ఒరె..పిడికిలి బిగించావే..యుద్ధానికే..నాతోనే..
          బక్కముష్టీ!   (ముళ్ళ గదతో మోదును)
దాసరి:- బక్కముష్టి కాదు..బక్కవీరముష్టి..పాండ్య రాజు సైన్యంలో పనిజేసిన 
           వాడిని..(ముళ్ళగదను కత్తితో కాచుకుని ముష్టిఘాతము నిచ్చును)
          ..రుచి చూడు!
బ్ర.రా:- (తూలీ..నిలదొక్కుకుని..)అబ్బా..ఎంతదెబ్బ కొట్టావురా..బక్క ప్రాణీ ..
         ఇంత బలమెక్కడిదిరా!
దాసరి:- బక్కవాడి బలం బొక్కల్లోనే వుందిరా..కాచుకో..(కత్తి విసురును)
బ్ర.రా:- (గదతో కాచుకుంటూ..) ఓసి శంఖిణీ ..చిత్తిణీ..ఎక్కడ చచ్చినారే..
         గొంతులోకి దిగకముందే వీడు అడ్డం తిరుగుచున్నాడే! వచ్చి చావండే...
         చావరా..చావు! 
         ( కొంత తడవు ఆయుధములతో యుద్ధము చేయుదురు
          ఆయుధములు జారిపోవు సరికి పెనగులాడుదురు...)
దాసరి:- నీచక్కదనానికి నలుగురు పెళ్ళాలా?వాళ్ళూ నీయంత అందగత్తెలేనా? 
           కూర్చుని తినమరిగి కుస్తీ పట్టడానికి గసపెడుతున్నావా? దా..దా..  
           (మరలా కలబడుదురు. విడివడి క్రిందపడిన తమతమ 
           ఆయుధములను  అందుకుందురు)
బ్ర.రా:- నన్నింత  విసిగించి ఇబ్బంది పెట్టిన తిండివి నువ్వే..నిన్ను 
         చంపకుండనే విరుచుకు తిందును..అప్పుడుగానీ నా కసి తీరదు..
 ( మాలదాసరి వెనుకకు చూచుచూ..వెనుకనుండి ఎవరో వచ్చుచున్నట్లు 
          భ్రమ గల్పించి పిలుచును)  
         ఒరె ..ఒరె ..వచ్చారా..మీయమ్మల కడుపులు మాడ! వీడిని పట్టుకోండే..
        ( ఎవరాయని ఏమరిపాటున వెనుకకు జూచిన దాసరిని నేలమీద 
         కూలిపోవువరకూ వరుసగా ముళ్ళ  గదతో మోదును. దాసరి 
        తలబట్టుకుని రక్తము కారుచుండగా 'హా రంగా'..'రంగనాధా..శ్రీరంగా..
        యని ఆర్తనాదములు జేయుచూ కూలిపోవును. బ్రహ్మరాక్షసుడు తన 
        నడుమునకున్న నరముల పాశముతో వాని కాళ్ళూచేతులూ బిగించి 
        బంధించి ఈడ్చివైచి..చెట్టుమొదలుకు పడవేసి తన నడుమునకున్న 
        కత్తిని సాన బట్టుచుండును)
దాసరి:- (నీరసముగా..) రంగనాధా...రావయ్యా..కరుణించు తండ్రీ!    
బ్ర.రా:-( కత్తినూరుట ఆపి..కలయజూచుచూ..అనుమానముగా...)ఎవడా 
         రంగడు..దొంగడు? ఇటు వచ్చునా? ఆహారమునకు పనికి వచ్చునా?
దాసరి:- నాకు పనికివచ్చును..నాయాహారమూ..పానీయమూ ఆ దైవమే..ఆ 
           శ్రీరంగనాధుడే! ఛీ..ఛీ...నన్ను వంచించి వెనుకపాటుగా గాయపరిచి 
           బంధింతువా? సిగ్గు లేదూ..పౌరుషం వుంటే కట్లు విప్పిచూడు!
బ్ర.రా:- వంచించుటకు మీ మానవులకే హక్కు గలదా? బ్రహ్మరాక్షసుడను..
          నాకేమి సిగ్గు..ఎగ్గు..???    
దాసరి:-(గతుక్కుమని) తమరు బ్రహ్మ రాక్షసులా? అయ్యా..బ్రహ్మ రాక్షసుల 
          వారూ..దయజేసి నన్నుమన్నించి నాపాలి బ్రహ్మదేవునివలె చిన్నకోర్కె 
           తీర్చుమయ్యా..ఆ తర్వాత రాక్షస ధర్మముగా నన్ను తీరిగ్గా 
           భోంచేద్దురుగాని.. వడ్డించిన కూరను!..నేనెక్కడికి పోగలను?
చ.      వినుమొక మాట రాత్రిచరా వేగిరమేతికి నిన్ జయింతురే
         యనిమిషులైన భాజన గతాన్నమ నేనిక ఎందుబోయెదన్ 
         పెనగాక ప్రాణ రక్షణ ముపేక్ష యొనర్చుట పాప మిందుకై
         కనలకు నాకు మేని ఎడ కాంక్షయు లేదిది వోవుటే యురున్
బ్ర.రా:- ఏమి నీ ఘోష? ఏమందువు?   
దాసరి:-అయ్యా! మహానుభావులైన హిరణ్య కశిపుడు, రావణుడు జన్మించిన 
          బ్రహ్మరాక్షస  కులంలో పుట్టి ఈ ప్రాణహింస నీకేల? మల
          మూత్రములతో నిండి..రుచి,శుచి లేని ఈ మానవ శరీరమా నీకు 
          తిండి? హింసతో కడుపునింపుకొనుట మహాపాపము కాదా? నేడో,
          రేపో నీవూ యమునికి లొంగవలసినదే కదా! ఇక్కడ నీవు 
          బలవంతుడవైన అక్కడ వాడు బలవంతుడు కదా!
బ్ర.రా:-ఓరి ఒరుగా! నాకు నీతిపాఠము లెందుకురా? నేనెంత చదివితిని! దాని 
         ఫలితమేమైనది? చివరకు బ్రహ్మరాక్షసుడ నైనితిని..ఇంతకూ నీవు 
         చదివిన కూరవైతివి! ఎక్కువ రుచిగా నుందువు!
క.       చంపకు చదువుల మేము ప 
          ఠింపని శాస్త్రములే మా పఠింపని శ్రుతులే
          ఇంపవవి నమ్మవే బ్రథ      
          మాం పిబతే వహ్ని యనెడు మాటవు గాదె 
దాసరి:- సరే లేవయ్యా! ఏడు మాటలాడినంతనే ఎట్టివారైననూ మిత్రులవుదురు 
           గదా..మనమిద్దరమూ మిత్రులమైతిమి..రాక్షసేశ్వరా! నా మనవిని 
           మన్నింపుమయ్యా..   
క.        ఈ కురగటి ఈ కురుగుడి 
           వైకుంఠు బాడివత్తు  వ్రతముగ దత్సే       
           వాకృతి కడపట నశనము  
          నీకౌదున్ముఖ్య  మిదియ నేడగు తుదకున్  
బ్ర.రా:- ఏమంటివేమంటివీ?
దాసరి:- ఈ సమీపముననే యున్న కురుగుడి క్షేత్రమునందు రంగనాధునికి 
           నిత్యమూ మేల్కొలుపులు పాడెడి వ్రతము కలదయ్యా..ఈ దినము నా 
           కర్మమిట్లు గాలినది..నీవు దయయుంచి వదలినచో నేడు కూడా నా 
           స్వామికి సేవజేసుకుని..నా వ్రతమును పాటించి..మరలా వచ్చి నీకు 
           ఆహారమునౌదును ..
బ్ర.రా:- (పరిహాసముగా నవ్వుచూ దాసరి చెక్కిలిమీద చరచి..) భళిరా..లెస్స 
         పండించితివిరా దాసరీ! ఈ మాటలను నమ్మి ఎవ్వడైననూ నోటికందిన 
         ఆహారమును వదలునా..వెర్రివాడెవడైననూ అట్లు వదలిననూ..మరలా 
         తిరిగివచ్చు వెర్రివాడెవడైననూ ఉండునా?
శా.      ఏ రాజ్యంబు నరుండు నోరికడివో నీ బోధ మాలించు  నిం
          కే రాజ్యంబు నరుండు బాసకై మేనీ దాన ఏతెంచు  దీ  
          పారన్నే జననీమియున్ మగిడి నీవా రామియుం దెల్ల మే 
          లా రంతుల్పలుపల్కు లంత్యకుల ఏలా చింత లేలా వగల్    

దాసరి:- (రెండు చెవులూ మూసుకుని) శ్రీ రంగ! నారాయణ!..రాక్షసేశ్వరా! 
          రంగదాసులు అసత్యములాడరు!  నా రంగని పాదములయాన! 
          ఫాలభాగపు కత్తురియాన! పదములచెంతనున్న మాయమ్మయాన! 
          నన్ను నమ్మి వదలుమయ్యా! చివరిసారిగా రంగనికి మేలుకొలుపు 
           పాడివచ్చి నీకు ఆహారమునౌతాను!
           (ఆకాశమువంక ఆందోళనగా జూచుచూ)ఇంకొంతసేపటికి తెల్లవారును..
           అయ్యో..రంగా..రంగా!
           (ఆర్తిగా గానము జేయ నారంభించును)
ప:-       నల్లని సామీ నా రంగా నవ్వుల రేడా శ్రీసంగా
           భవభయజలధులు గడువంగా ఘన మునిమనముల గజదొంగా       
ఆ.ప:-   దయగల సామీ మేలుకో
            దాసుల దయ జూసి ఏలుకో ||నల్లని||
చ:-       శుక పిక సమూహముల సరిగమలు కలిగె
            రవి అరుణ కిరణముల గగనము వెలిగె
            కావేరి గలగలల సాహోల చెలగి 
            దేవేరి కిలకిలల తమకాలు తలగి ||నల్లని||
చ:-       శ్రీ నీల చనుదోయి నిదురింతువో హాయి
            నీ నీలి కనుదోయి తెరిపించి లేవోయి
            ఘనమైన ఫణిభోగ వర యోగశాయీ
            క్షణమైనా నీ వారి మొర వినగదోయీ||నల్లని||
చ:-       శ్రీరంగ పురినేలు నరసింగ రంగా
            దనుజ విభంగా భవ భంగా
            కోరిన కోర్కెలు గారంగా
            కొంగు బంగారంగా కురియంగా ||నల్లని||
దాసరి:- (ఏడ్చుచూ బ్రహ్మరాక్షసుని పాదములపై బడి..) రాక్షసేశ్వరా..నన్ను 
           నమ్మి వదులుమయ్యా..తప్పక తిరిగివచ్చి నీకు ఆహారమునౌతాను..
           నేను మరలా తిరిగి రాకున్నచో నా రంగనికన్న మిన్నయైన దైవము 
           గలదని నమ్మిన మహాపాపము చేసిన వాడనౌదును...
బ్ర.రా:- (అంతకంతకూ మెత్తబడుతూ అతని గానమునకు ఆనందించుచూ 
          వచ్చిన దయతో..) సరే! ఇంతగా ప్రాధేయపడుచున్నావు  గనుక, నీ 
         రోదనమునకు విసుగెత్తి వదలుచున్నాను! మరలా రాకుంటివా..నీ 
         రంగడు నిజముగనే దొంగడనుకుందును!(దాసరి యానందముగా 
         బ్రహ్మరాక్షసునకు నమస్కరించి తన పరికరములను తీసుకుని 
         ఆకసమువంక జూచుచూ పరుగున నిష్క్రమించును. బ్రహ్మరాక్షసుడు 
         నలుమూలల తనవారికొరకై జూచుచూ గావుకేకలతో పిలచుచూ 
         అరచుచూ కత్తిని సాన బట్టుచూ పాశమును పేనుచూ చివరికి అలసి 
         నిదురించును. తెల్లవారినటుల అడవి కోడి కూయును. కొంత తడవునకు 
         మాలదాసరి పరమానందముగా  పరుగున వచ్చును.) 
దాసరి:-(భీకరముగా గురకలిడుచూ నిదురించుచున్న బ్రహ్మరాక్షసుని జూచి 
           చిరునవ్వుతో) బ్రహ్మమునకే గాక  బ్రహ్మరాక్షసునకు కూడా 
           మేలుకొలుపులు పాడవలెనా? ( బ్రహ్మరాక్షసుని తట్టి లేపుచూ..) 
           మహానుభావా! మేలుకోవయ్యా! లే..లే..నీ దయవలన నా చివరిరోజున 
           కూడా నా వ్రతం చెల్లించుకున్నాను..ఈశరీరంతో చివరిసారిగా 
           రంగనిదర్శనం చేసుకున్నాను!
          (ఆశ్చర్యముతో జూచుచున్న బ్రహ్మరాక్షసుని కుదుపుచూ)  
          ఇక నన్ను భోంచేసి తీరికగా నిదురబోదువు గాని! ఇదుగో చూడు..నన్ను 
         నువ్వు పంపునపుడు ఎలా వెళ్ళానో అలా వచ్చాను..నీశరీరాన్ని నీకోసం 
         భద్రంగా తెచ్చాను!
        ఉ. నీచెర బాసి పోయి రజనీచర చక్రి భజింప ముక్తిపొం 
             దేచెర ఏ చెరన్ దవుల నేనిక నుండగ జూడు పంచుచో    
             నే చరణంబు లేయుదర మేయుర మేశిరమే కరంబులీ 
             వా చరణంబు లాయుదర మాయుర మాశిర మాకరంబులున్
బ్ర.రా:- ( ఆశ్చర్యముతో..ఆనందముతో దాసరి పాదములపై బడి ఏడ్చుచూ..)
          భక్త శిఖామణీ ..భాగవతోత్తమా!..సత్య పాలనలోనూ..సాధు జీవనంలోనూ..
          శ్రీహరి సేవనంలోనూ..మధుర సంగీత సాధనంలోనూ..నీకు సాటి రాగలిగిన
          వారు లేరు! 
     చ. ఇతరులు నీకు నీడె మరి ఈ ధృతి నీ స్మృతి నీ ఋతేరిత 
          స్థిత గతి నీ మురారి పాదసేవన జీవనవన్మతిన్ సమా
          ధృత కలగాన సింధు లహరీ ప్లవన ప్లవ భావ భా గురు
          శృతి తత బద్ధ తుంబికి కురుంగుడి నంబి కృపావలంబికిన్
దాసరి:- (పరిహాసము గా) ఏమిది? తాళము మారుచున్నది! రాగము కొత్తగా 
          సాగుచున్నది!
బ్ర.రా:- (ఏడ్చుచూ..)
         మహానుభావా! నేను పూర్వజన్మలో సోమశర్మయనే విప్రుడను! 
         అహంకరించి, పాపకర్ముడనై ఫలితముగా ఈ బ్రహ్మరాక్షస జన్మను 
         పొందితిని! ఎన్ని సంవత్సరముల నుండియో ఒక పుణ్యాత్ముడెవరైననూ 
         ఇటు రాకపోవునా? నన్ను కనుకరించకపోవునా..యని ఎదురు 
         జూచుచున్నాను!  
దాసరి:- (అనుమానముగా జూచుచూ) 
           నాకెందులకీ గాథ? ఇంతకూ ఏమందువు? నన్ను తిందువా? 
           గత జన్మల గాధలతో పస్తులుందువా?  
బ్ర.రా:- నన్ను కనుకరించి నీ గానకైంకర్య  ఫలితమును నాకు ధార పోసినచో 
         నా ఈ భయంకర రూపము దూరమౌను! నీ దయవలన పూర్వపు 
          రూపమును, జన్మమును పొందగలను!..నా తిండికొరకై నీ 
          ప్రాణములను త్యాగముజేయ నవసరమూ లేదు..
దాసరి:-ఏమేమీ? (కిల కిల నవ్వుచూ..) నా గానకైంకర్య ఫలితమును నీకు ధార 
          వోసి..నీ రాక్షసత్వమును తొలగించి నా ప్రాణరక్షణము జేసుకొనవలెనా? 
          కర్పురమునిచ్చి బదులుగా ఉప్పును తీసుకొమ్మందువా? ఏమి 
          చాతుర్యము! బ్రహ్మరాక్షసుడ ననిపించినావు!
బ్ర.రా:-అయ్యా! దయమాలి ఇట్లు పలుకుట భాగవతులకు తగునా? ప్రపన్నుల 
        అంతరంగము సాక్షాత్తూ శ్రీరంగము కాదా? వారి నిర్మలదయాసారమే 
        కావేరీ నీరము కాదా? నన్ను కరుణించి ఈ ఘోర రూపము నుండి నాకు 
        విముక్తిని గలిగించు తండ్రీ!
     క. మీవంటి భాగవతులుం
         పావనులుగ జేయరేని మరిగతి ఏదీ
         మావంటి వారికిక మా 
         ఏవము వెనుకటిది జూడ కీక్షింపు కృపన్  
దాసరి:-రంగ రంగ..వీలుగాదు! నా గానకైంకర్య ఫలితమును నేనెట్లు వదులుకొన 
          గలను..పంతముజేయక నన్ను అంతముజేసి నీయాకలిని దీర్చుకొనుము!
బ్ర.రా:- (దాసరి పాదములపై బడి..)అయ్యా! మొత్తముగాకున్ననూ నీ గానకైంకర్య 
          ఫలితమునందు పాతిక పాలైననూ ధారవోసి ఈ పాపమయరూపము 
          బాపుమయ్యా!
దాసరి:- ఏమిటీ సంత బేరములు? పాతిక పాలు కాదుగదా..పనస ముల్లంత 
          యైననూ వీలుగాదు..వీలుగాదు!
బ్ర.రా:-వీలు కాదా? బ్రహ్మరాక్షసుడనైన నేనే దయగలిగి నీ కోర్కెను 
        మన్నించితినే! రంగదాసుడవైన నీవు నాకోర్కెను మన్నింపవా? నేను 
         కరుణించి విడిచిపెట్టుట వల్లనే గదా ఈనాడు వెళ్లి పాడగలిగినావు? 
         న్యాయముగా ఆ ఫలితము నాకు చెందవలసినదే గదా!
దాసరి:-(ఆలోచనలో పడిపోవును) నీ జన్మకు ఇదొక్కటి సత్యము పలికి
          యుందువు బహుశా..ఐననూ..ఊహూ..వీలుగాదు!
బ్ర.రా:- మనము స్నేహితులమంటివే, స్నేహ ధర్మమునైనూ పాటింపవా?ఈ 
          పాపిష్టి జీవనమును మానుకొమ్మని ధార్మికబోధలు జేసితివే..అందుకు 
          సహకరించుట నీధర్మముగాదా? 
          (దాసరి ఇరకాటమున పడినట్లు..ఆలోచనలో పడినట్లు సతమతమౌను)
          నీ రంగనియాన! ఆ నొసటి కత్తురి యాన! పాదముల చెంతనున్న ఆ 
          లచ్చియాన! నన్ను కనుకరించనిచో నీ రంగనికన్న మిన్నయగు 
          దైవము గలదని నమ్మిన మహాపాపము నీకు చుట్టుకొనును గాక..
          (కత్తితో తన తలను నరుకుకొన బోవును)
దాసరి:-ఆ..ఆ..(ఆతని చేతిలోనుండి కత్తిని లాగి పారవైచి ఆనందబాష్పములను 
          విడచుచూ అతనిని యాలింగనము జేసుకొనును) నీ బ్రహ్మరాక్షస 
          ప్రయత్నము ఫలించినదయ్యా..నీ దయవలన నేను పాడగలిగిన 
          ఈనాటి ప్రభాతసమయ చరమగీత ఫలితమును నీకు 
          ధారబోయుచున్నాను! ఆ రంగడు నిన్ను అనుగ్రహించును గాక!
          (బ్రహ్మ రాక్షసుడు దాసరి పాదములపై పడి పోవును. ధగధగలతో దివ్య 
          వర్చస్సుతో సోమశర్మ ప్రత్యక్షమగును. దాసరి అతనిని లేవదీయును.) 
సోమశర్మ:- భూషణమౌను సత్య దయ పూత గుణంబులు మానవాళికిన్
                శోషణ జేసి కామగుణజాలము  శోభల కీర్తి చంద్రుడై   
                భీషణరోష దు:ఖ పరి పీడితుడయ్యును ఏరిపైన దు
                ర్భాషలు రానియట్టి గుణ భాసుర మూర్తికి నంజలించెదన్
                మహానుభావా వందనములు!
దాసరి:- (ఆశ్చర్యముగా..ఆనందముగా..) అయ్యా! నాకు నమస్కరింప వలదు ..
           తమరు ఉత్తమజన్ములు..నేనొక దాసరిని!
సోమశర్మ:- గుణముచేతనే ఉన్నతుడవును గానీ..కులముచేత మానవుడెవడూ  
               ఉన్నతుడు కాడయ్యా! ఉత్తమ కులమున జన్మించి భ్రష్టుడనై..
               బ్రహ్మరాక్షసుడ నైన వాడను నేను! తక్కువ కులమునందు 
               జన్మించిననూ శ్రీహరికి ఇష్టుడవై..బ్రహ్మవేత్తవైన వాడవు నీవు..
               బ్రహ్మ జ్ఞానము కలిగినవాడే బ్రాహ్మణుడు గనుక..నీవు నిక్కమైన 
               బ్రాహ్మణుడవు! నన్ను కనుకరించి పునర్జన్మను ప్రసాదించిన 
               గురుదేవుడవు! గురుదేవా! వందనములు! 
             ( సాష్టాంగ దండ ప్రణామము జేయును)
దాసరి:- (వెనుకకు జరగుచూ..ప్రాధేయ పడుచూ..సిగ్గుతో) అయ్యయ్యో..వలదు..
           వలదు..అక్షర జ్ఞానములేని అధముడను నేను. వేద వేదాంగములను 
           అభ్యసించిన పండితులు తమరు..తమరికి నేను గురువునగుట ఏమి..
           నగుబాటు..
సోమశర్మ:- జాగృత్స్వప్న   సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జ్రుమ్భతే
                యా బ్రహ్మాది పిపీలకాంత తనుషుప్రోతా జగత్సాక్షిణీ 
                సైవాహం నచ దృశ్య వస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తిచేత్  
                చండాలోస్తు సతు ద్విజోస్తు గురు రిత్యేషా మనీషా మమ
                
               సర్వకాల సర్వావస్థలయందునూ సకల చరాచర జీవకోటి యందునూ 
               వెలుగొందే వెలుగే నాయందునూ కలదు గనుక నేనేవరికన్ననూ 
               ఉత్తముడనూ గాను..ఎవరూ నాకన్నా అధములూ గారు..ఆ వెలుగే 
               అ'క్షరము'..అనగా నాశములేనిది..పొట్ట కూటి కోసం నేర్చుకునే 
               అక్షరంముక్కల జ్ఞానము జ్ఞానము కాదయ్యా..ఆ అక్షరమైన 
               అనంతమైన పరమాత్మ తత్త్వ జ్ఞానమే జ్ఞానము! అది గలవాడే..
               నా గురుదేవుడు..కనుక నీవే నాగురుదేవుడవు! గురుదేవా 
               ప్రణామములు!
దాసరి:- (ఆనందముగా) శ్రీరంగార్పణమస్తు!
సోమశర్మ:-( ఒక్క క్షణము కనులు మూసుకుని) గురుదేవా! తమరి గాన కైంకర్య 
               ఫల ప్రభావముచేత చెప్పగలుగుచున్నాను..శ్రీరంగమునందు స్వామి 
               రంగనాధునికీ గోదాదేవికీ పరిణయము జరుగబోవుచున్నది! చూచి 
               తరింతము రండు!
దాసరి:- ఆహా..ముగురమ్మలకు తోడు నాల్గవ తల్లియా? తప్పక తిలకింపవలసిన  
           కళ్యాణము! త్వరగా వెళ్ళుదము...     
 (నిష్క్రమింతురు. తెర)